తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మారుతోందా…? అంటే అవుననే కామెంట్స్ వినపడుతున్నాయి. లడ్డు వివాదం విషయంలో పవన్ కళ్యాణ్ చాలా దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. 11 రోజుల దీక్ష ఆ తర్వాత వారాహి బహిరంగ సభ, ఆ సభలో డిక్లరేషన్ ప్రకటించడం ఇవన్నీ చేసారు పవన్. ఇక ఇదే సభలో ఆయన చేసిన కామెంట్స్ కూడా పెద్ద దుమారమే రేపుతున్నాయి అనే మాట వాస్తవం. ముఖ్యంగా తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి లక్ష్యంగా ఆయన వ్యాఖ్యలు చేసారనే వార్తలు సంచలనం అవుతున్నాయి.
ఈ నేపధ్యంలో తమిళనాడులో పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేసారు ఓ లాయర్. ఏపీ డిప్యూటీ సీఎంపై తమిళనాడులోని మదురైలో కేసు నమోదు చేసారు. మతాలను రెచ్చ గొట్టే వ్యాఖ్యాలు చేశారంటూ మదురై న్యాయవాది కేసు పెట్టడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. సనాతన ధర్మం అనేది ఒక వైరస్ దాన్ని నాశనం చేస్తానని ఒక యువనేత అంటున్నాడు, నీలాంటోళ్ళు చాలామంది చరిత్ర లో వచ్చారు పోయారంటూ తిరుపతిలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపైనే దుమారం మొదలైంది.
Read Also:ఇక్కడేం మాట్లాడొద్దు.. అక్కడికే రండి.. జగన్ వింత వైఖరి
ఈ వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి అన్నారని ప్రచారం చేస్తోంది వైసీపీ. ఇదే వ్యాఖ్యలపై అటు డిఎంకె సోషల్ మీడియా విభాగం కూడా కౌంటర్ లు ఇవ్వడం మొదలుపెట్టింది. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్ లెట్స్ వెయిట్ అండ్ సీ అని సమాధానం చెప్పారు. ఇక పవన్ టార్గెట్ గా పాత విడియోలను బయటకు తీసి డిఎంకె సోషల్ మీడియా ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. ఇక పవన్ కు సపోర్ట్ గా బిజెపి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. పవన్ కల్యాణ్ పై మదురై పోలీస్ కమిషనర్ కు న్యాయవాది వాంజినాధన్ ఫిర్యాదు చేయడం తో నాలుగు సెక్షన్ లు 499, 500, 504, 505 కింద కేసులు పెట్టారు. దీనితో ఇది క్రమంగా తమిళనాడు డిప్యూటీ సిఎం వర్సెస్ ఏపీ డిప్యూటీ సిఎం మధ్య వార్ లా మారుతోంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

