ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కాంకి సంబంధించి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. లిక్కర్ కేసులో కీలక సమాచారం సేకరించిన ఏపీ సిఐడి అధికారులు దీనిపై విచారణ ముమ్మరం చేసారు. జగన్ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరగగా… కీలక సూత్రధారులుగా వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలాగే వైసీపీ నేతలే పాత్రధారులుగా ఈ దందా సాగింది. వైసీపీ నేతల డిస్టలరీల నుంచి మద్యం సేకరించారు. ఏపీ బేవరేజెస్ కి 100 కంపెనీలు లిక్కర్ సప్లయి చేశాయి. వంద కంపెనీల్లో కేవలం 16 కంపెనీల నుంచే 74 శాతం లిక్కర్ కొనుగోలు చేసారు.

వైసీపీ నేతలకు చెందిన డిస్టలరీలలోనే మద్యం తయారు చేసారు. ఎస్పీవై ఆగ్రో, ఆదాన్ డిస్టలరీ లిక్కర్ తయారీ వెనుక మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఉన్నారని గుర్తించారు. విశాఖ, పిఎంకే, పెరల్, ఎస్.వీ.ఆర్ తో పాటు పలు ఇతర డిస్టలరీలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నట్టుగా గుర్తించారు. ఎస్పీవై నుంచి సంవత్సరానికి రూ. 1,863 కోట్ల లిక్కర్ కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఆదాన్ నుంచి రూ. 1165 కోట్ల లిక్కర్ కొనుగోలు చేసారు. ఎస్.ఎన్.కే డిస్టలరీ, ఎస్.ఎన్.కే షుగర్స్ నుంచి రూ. 1,996 కోట్ల లిక్కర్ కొన్నారు. ఇలా తమకి అనుకూలమైన దిస్టిలరీల నుంచే అత్యధికంగా మద్యం కొనుగోలు జరిగింది. అనధికారికంగా కూడా మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుంది.

ప్రతి రోజు మద్యం 80 లక్షల మంది ప్రజలు తాగుతుండగా… అంచనా ప్రకారం ఏడాదికి ప్రభుత్వానికి రూ. 57,600 కోట్ల రెవెన్యూ రావాల్సి ఉండగా కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం రూ. 32 వేల కోట్లు మాత్రమే రెవెన్యూ వచ్చింది. దాదాపు రూ. 25 వేల కోట్ల రెవెన్యూ దారి మళ్లించారు. డబ్బు దారి మళ్లింపులో కీలక పాత్రధారులుగా వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీనిపై ఇప్పుడు విచారణ ముమ్మరం చేసారు. త్వరలోనే మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. వీరి వెనుక ఎవరున్నారు అనేది సామాన్య ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసు. వీరందరూ నోరు తెరిస్తే ఆ పెద్ద తలకాయ అరెస్ట్ అవ్వడం తప్పదని రాజకీయ వర్గాల సమాచారం.




