వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కు మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విభేదాలను పరిష్కరించే దిశగా కుటుంబంలో ఉన్న పెద్దలు కొందరు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా, అది సాధ్యం కావడం లేదు. తనపై జగన్ విమర్శలు కొనసాగించక పోయినా షర్మిల మాత్రం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు మించి జగన్ పై ఆమె ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ముంబై హీరోయిన్ వ్యవహారంపై కూడా షర్మిల జగన్ ను టార్గెట్ చేశారు.
అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న వివాదం పరిష్కరించుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరి మధ్య రాజీ కుదిర్చే దిశగా వైఎస్ ఆత్మగా పిలవబడే మాజీ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరి కుటుంబానికి కేవీపీ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే కేవీపీ ద్వారా జగన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. వైసీపీలో ఉన్న ఒక కీలక నేత, కేవీపీ ఇద్దరూ కలిసి షర్మిల తో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. షర్మిలకు జగన్ కు మధ్య ఆస్తుల విషయంలోనే వివాదం చెలరేగింది. ఇప్పుడు ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి జగన్ సిద్దంగా ఉన్నారట.
Read Also : అమరావతి ముంపు కోసం ఎదురుచూస్తున్న గుంటనక్కలు
ఇక వైఎస్ వర్ధంతి సందర్భంగా కూడా షర్మిలతో భారతి మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో ఉండటంతో తనకు ఎప్పటికి అయినా ఇబ్బందే అనే భావనలో జగన్ ఉన్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ అధిష్టానానికి జగన్ ను షర్మిల దగ్గర కానీయడం లేదు. అందుకే జగన్ ఇప్పుడు ఆమె తో వివాదం కంటే పరిష్కారమే మంచిదనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ వర్ధంతి సందర్భంగా పలు కీలక విషయాల మీద కేవీపీ షర్మిలతో మాట్లాడినట్లు సమాచారం. బెంగళూరులో ఉన్న ఆస్తులను కాకుండా హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల విషయంలో వీరి మధ్య చర్చ జరిగినట్టుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి వీరి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియాలి అంటే కొంతకాలం ఆగక తప్పదు.