తెలంగాణా రాజకీయాల్లో కాళేశ్వరం వ్యవహారం సంచలనం అయింది. ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ సిఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ ను కలవరపెడుతోంది. తాజాగా దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆ ఇద్దరు, ముగ్గురు నేతలే కేసీఆర్పై కుట్రలకు పాల్పడుతున్నారని సంచలన కామెంట్స్ చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ ది కీలకపాత్ర అని మండిపడ్డారు కవిత. వీరి వెనుక రేవంత్ ఉన్నారని, వారిని కాపాడుతున్నారని అన్నారు.
Also Read : బెంగళూరు టూ పులివెందుల.. తాడేపల్లి లేనట్టే..!
నేనిప్పుడు మాట్లాడితే నా వెనుక ఎవరో ఉన్నారంటారన్న ఆమె, కానీ, అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు బాధ్యుణ్ణి చేస్తూ రేవంత్ ప్రభుత్వం మా నాన్నపై సీబీఐ విచారణ వేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. నా కడుపు మండిపోతోందన్నారు. మా నాన్నకు డబ్బు, తిండిపై ఏనాడూ యావ లేదన్నారు.
Also Read : బీఆర్ఎస్ జుట్టు.. కేంద్రం చేతిలో పెట్టిన రేవంత్
మా నాన్న పరువు పోతే మాకు బాధన్న ఆమె వాళ్లకు ఏం లేదని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుది మేజర్ పాత్రన్నారు కవిత. అందుకే హరీష్ రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించారన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వల్లే కేసీఆర్కు ఈ పరిస్థితి దాపురించిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ను అడ్డుపెట్టుకుని హరీష్, సంతోష్ భారీగా ఆస్తులు కూడబెట్టారన్నారు. హరీష్ రావు, సంతోష్ రావుకు డబ్బు మాత్రమే కావాలన్నారు. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని ఆమె కంటతడి పెట్టారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఆ కుటుంబంలో జరిగే గొడవలు మాపై రుద్దడం ఏంటని నిలదీసింది.