ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై వైసీపీ, సాక్షి పత్రిక, వైఎస్ జగన్ కలిసి ప్రజలను గందరగోళానికి గురిచేసే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్, టీడీపీ ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ.1.19 లక్షల కోట్ల అప్పును రూ.2.93 లక్షల కోట్లుగా చూపించడం పూర్తిగా అబద్ధం, ఆర్థిక అజ్ఞానానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం మాత్రమే ఆర్బీఐ ద్వారా బాండ్లు జారీ చేయాల్సి ఉంటుందని, ఈ అప్పులన్నింటినీ కాగ్ (కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నెలనెలా అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపారు. కాగ్ లెక్కల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం అప్పులు రూ.81,597 కోట్లు. ఇందులో ఏప్రిల్–మే 2024లో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.38,700 కోట్లు. కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.42,897 కోట్లు మాత్రమే. 2025–26 ఆర్థిక సంవత్సరం (నవంబర్ 2025 వరకు) కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.77,040 కోట్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ 2025 వరకు చేసిన మొత్తం అప్పు రూ.1,19,937 కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అలాంటప్పుడు రూ.2.93 లక్షల కోట్ల అంకె జగన్ ఎక్కడి నుంచి తెచ్చారో వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : జిల్లా ఏర్పాటు సరే.. మరి వాటి సంగతి..?
జగన్ చేస్తున్న తప్పుడు లెక్కలు
కార్పొరేషన్లు, స్వతంత్ర సంస్థలు తీసుకున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా కలిపి చూపడం, సీఆర్డీఏ మార్క్ఫెడ్, అమరావతి నిర్మాణ రుణాలను ప్రభుత్వ అప్పుల్లో చేర్చడం, వర్కింగ్ క్యాపిటల్ లోన్లను కూడా ప్రభుత్వ అప్పులుగా ప్రచారం చేయడం ఇవి ఆర్థిక సూత్రాలకు, బిజినెస్ రూల్స్కు పూర్తిగా విరుద్ధమని తెలిపారు. సీఆర్డీఏ అప్పులు అమరావతి రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నవని, వాటిని సీఆర్డీఏ సంస్థే తీరుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంపై భారం కాదని స్పష్టం చేశారు. అలాగే మార్క్ఫెడ్ అప్పులు రైతుల ధాన్య సేకరణ కోసం తీసుకునే వర్కింగ్ క్యాపిటల్ లోన్లు మాత్రమేనని తెలిపారు.
వైసీపీ పాలనలో అసలు అప్పుల నిజాలు
వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్యారెంటీ, నాన్-గ్యారెంటీ కార్పొరేషన్ రుణాలు.. యూనివర్సిటీలు, బోర్డులు, కార్పొరేషన్ల నుంచి తీసుకున్న డిపాజిట్లు.. లిక్కర్ బాండ్లు, కాంట్రాక్టర్ల బకాయిలు.. ఉద్యోగుల బకాయిలు ఇవన్నీ దాచిపెట్టి “మేము చేసిన అప్పులు తక్కువ” అంటూ జగన్ మాట్లాడడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.
Also Read : జిల్లా ఏర్పాటు సరే.. మరి వాటి సంగతి..?
కూటమి ప్రభుత్వం బాధ్యతాయుత పాలన
కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో మిగిలిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తూ బాధ్యతాయుతంగా పాలన సాగిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక చలనం పెంచేందుకు అమరావతి నిర్మాణం, పెట్టుబడులు, పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. రూ.1.19 లక్షల కోట్ల అప్పును రూ.2.93 లక్షల కోట్లుగా చూపించడం రాజకీయ నాటకం మాత్రమేనని, ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, అబద్ధాలతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఆపలేరని నీలాయపాలెం విజయ్కుమార్ స్పష్టం చేశారు.

