ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఒకటే… అది జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు. ఇంకా చెప్పాలంటే… ఆస్తి కోసం సొంత తల్లి, చెల్లిపైనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిటిషన్ వేయడం ఇప్పుడు సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు ఇలా ఆస్తి కోసం బజారున పడటం ఏమిటని అంతా ప్రశ్నిస్తున్నారు. అలాగే చెల్లికి ఇచ్చిన ఆస్తిని లాక్కోవాలని సొంత అన్న జగన్ కుట్రలు చేస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరో అంశంపై జగన్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు.
రాజకీయాల్లో కుటుంబ సభ్యులు కూడా బద్ధ శత్రువులుగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అన్నదమ్ములు, బావ బామ్మర్దులు, చివరికి తండ్రి కొడుకులు కూడా వేరు వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. ఇక ఎన్నికల సమయాల్లో అయితే పలుచోట్ల భార్యభర్తలు కూడా నువ్వా నేనే అంటూ చేరో పార్టీ తరఫున పోటీ చేసిన సందర్భాలున్నాయి. అయితే సొంత అన్న, చెల్లెలు ఎన్నికల్లో తలపడిన సందర్భాలు చాలా అరుదు. ఇక జగన్ జైలులో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 వేల కిలీమీటర్లు పైగా పాదయాత్ర చేశారు. వైసీపీ గెలుపు కోసం చెమటోడ్చారు. అయితే జగన్ గెలిచిన తర్వాత… షర్మిలను పక్కన పెట్టేశారు. చివరికి ఇచ్చిన ఆస్తిని కూడా లాక్కునేందుకు కోర్టుకు వెళ్లారు.
ఇదే సమయంలో అన్నచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకలుగా నిలిచే మరో అగ్ర కుటుంబం గురించి కూడా ఇప్పుడు విస్తృతంగా చర్చ నడుస్తోంది. దేశ రాజకీయాలను శాసించిన గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అన్న రాహుల్ గెలుపు కోసం ప్రియాంక విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే ప్రస్తుతం వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న ప్రియాంక కోసం రాహుల్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. గతంలో రాహుల్ పాదయాత్ర చేసిన సమయంలో పలు సందర్భాల్లో ప్రియాంక కూడా సంఘీభావం తెలిపారు.
Also Read : తెలంగాణాలో రేవంత్ బీ టీం…?
ఇక పాదయాత్ర ముగింపు సమయంలో జమ్ము కశ్మీర్లో ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు కలిసి చేసిన చిలిపి చేష్టల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది కూడా. అన్న చెల్లెలు అంటే ఇలా ఉండాలనే ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక మరోవైపు తెలంగాణకు చెందిన కేటీఆర్, కవితల మధ్య అనుబంధాన్ని కూడా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి ఏటా కేటీఆర్కు కవిత రాఖీ కట్టడం… అన్న ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. ఇక కవిత జైలులో ఉన్న సమయంలో ఆమె విడుదల కోసం కేటీఆర్ ఎంతగానో ప్రయత్నించారు.
చివరికి బెయిల్పై కవిత విడుదలవుతున్న సమయంలో తీహార్ జైలు బయట దాదాపు 2 గంటల పాటు వేచి ఉన్నారు కేటీఆర్. చెల్లిని స్వయంగా తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఇక మద్యం కుంభకోణం కేసును కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఓ వైపు అన్నా చెల్లెళ్ల అనుబంధం ఇలా సాగుతుంటే… జగన్ మాత్రం… ఆస్తి కోసం సొంత చెల్లి షర్మిల పైనే కేసు వేయడాన్ని అంతా తప్పుబడుతున్నారు. గతంలో గాంధీ కుటుంబానికి వీరవిధేయులుగా ఉంది వైఎస్ కుటుంబం. అలాగే సీఎంగా ఉన్న సమయంలో కేటీఆర్తో అత్యంత సన్నిహితంగా కూడా వ్యవహరించారు జగన్. అలాంటి వాళ్లను చూసైనా నేర్చుకోవాలి కదా జగనన్న అని… సొంత పార్టీ నేతలే సలహాలిస్తున్నారు.

