వైసీపీ మాజీ మంత్రి విడుదల రజిని రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని కాదని ఆమెకు గుంటూరులో సీటు కేటాయించారు. అయిష్టంగానే పోటీకి వెళ్లిన ఆమె ఆ తర్వాత గతంలో చేసిన కార్యక్రమాల తాలూకు కేసులతో ఇబ్బంది పడ్డారు. దీంతో రాజకీయంగా ఆక్టివ్ గా ఉండలేని పరిస్థితి నెలకొంది. దానికి తోడు నియోజకవర్గంలో పరిస్థితులు కూడా తనకు కలిసి రాకపోవడంతో ఆమె మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గానికి వెళ్లాలని భావించారు.
Also Read : ఈషా వేదికగా.. రాజ్ సమంత వివాహం?
కానీ అక్కడ కూడా పరిస్థితి వ్యతిరేకంగానే ఉండటంతో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న రజినీని.. రేపల్లె వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. రేపల్లె నియోజకవర్గంలో పరిస్థితి వైసీపీకి అనుకూలంగా లేకపోవడం.. అక్కడ కీలకమైన మత్స్యకార సామాజిక వర్గం టిడిపి వైపు ఉండటంతో రజిని వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదట. దానికి తోడు మోపిదేవి వెంకటరమణ లాంటి బలమైన నాయకుడు టిడిపిలోకి వెళ్లిపోవడంతో.. అక్కడ తనకు సహకారం ఉండదనే భావనలో కూడా రజనీ ఉన్నట్లు సమాచారం.
Also Read : ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!!
అందుకే రాజకీయాలకు దూరం కావాలని రజనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రజనీకి వ్యక్తిగత వ్యాపారాలు ఉండటమే కాకుండా.. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి అమెరికా వెళ్ళిపోవాలని రజనీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని వైసిపి అధిష్టానానికి రజని చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వారంలోనే రజిని నుంచి ప్రకటన ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఆమె రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అలాంటి నేత పార్టీకి దూరమైతే.. ఇతర మహిళ నేతలు కూడా వెనక తగ్గే అవకాశం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

