శ్రీకాకుళం జిల్లా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ధర్మాన ప్రసాదరావు. 1989 నుంచి ఉత్తరాంధ్రలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గెలిచిన తొలిసారే మంత్రిపదవి. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మొదలైన ప్రస్తానం… చివరికి ఏఐసీసీ సభ్యుని స్థాయి వరకు ఎదిగారు. ధర్మాన అంటే ఓ పొలిటికల్ కాలేజ్ అనేది ఆయన శిష్యుల మాట. ఆయన దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఎంతోమంది రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అలాంటి వారిలో ఒకరు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. ధర్మాన ప్రసాదరావుతో పాటు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కూడా ఏపీ రాజకీయాల్లో కీలక పదవులు అనుభవించారు. జగన్ సర్కార్లో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు ధర్మాన కృష్ణదాస్. ఇలాంటి ధర్మాన సోదరులను జగన్ కనీసం గుర్తించలేదు.
Also Read : స్టార్ హీరో కొడుకుతో ప్రేమలో అనుపమ
రెండు రోజుల క్రితం వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. పీఏసీలో కొత్తగా మొత్తం 33 మందిని సభ్యులుగా నియమించారు. ఈ 33 మందిలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఐదుగురికి స్థానం కల్పించారు. తమ్మినేని సీతారాం, గొల్ల బాబురావు, బెల్లాన చంద్రశేఖర్, పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు పీఏసీలో చోటు దక్కించుకున్నారు. గొల్ల బాబురావు, బూడి ముత్యాల నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు కాగా… బెల్లాన చంద్రశేఖర్, పీడికి రాజన్న దొర మాత్రం ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన నేతలు. శ్రీకాకుళం జిల్లా నుంచి మాత్రం కేవలం తమ్మినేని సీతారాంకు మాత్రమే పీఏసీలో అవకాశం ఇచ్చారు జగన్. ఇదే ఇప్పుడు సిక్కోలు వైసీపీలో పెద్ద చర్చకు తెరతీసింది.
Also Read : జగన్ పాపాలు.. మన ప్రాజెక్టులు సెఫేనా..?
వాస్తవానికి వైసీపీ ప్రారంభానికి ముందే జగన్కు మద్దతు తెలిపిన నేత ధర్మాన కృష్ణదాస్. 2009లో నరసన్నపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కృష్ణదాస్.. 2012లో జగన్కు మద్దతు తెలిపారు. ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత రెండేళ్లకు తమ్మినేని వైసీపీ కండువా కప్పుకోగా.. సరిగ్గా 2014 ఎన్నికలకు రెండు నెలల ముందు ధర్మాన ప్రసాదరావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాజకీయాల్లో తొలి నుంచి ధర్మాన, తమ్మినేని మధ్య విభేదాలు. తమ్మినేని తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా కూడా పని చేశారు. ధర్మాన కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు నేతలు వేరు వేరు పార్టీలు. అయితే 2014 నుంచి ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. ఒకే వేదికపై కలిసి పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇద్దరు నేతలు రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభాపతిగా వ్యవహరించిన సమయంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పైన, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్పైన తమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరికి రాజధాని ప్రాంతాన్ని స్మశానంతో పోల్చారు. కానీ ధర్మాన మాత్రం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. అదే సమయంలో ఎన్నికల సమయంలో సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. దీంతో నాటి నుంచి ధర్మాన ప్రసాదరావును జగన్ దూరంగా పెట్టారు.
Also Read : తిరుమల ఘటనపై బీఆర్ నాయుడు సంచలనం
పీఏసీలో తమ్మినేనికి చోటు కల్పించి.. ధర్మానకు అవకాశం లేకపోవడంతో.. ధర్మాన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ధర్మాన చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. రాజశేఖర్ హయాంలో రెవెన్యూ శాఖ మంత్రిగా వ్యవహరించిన సమయంలో వైఎస్ఆర్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు. అందుకే జగన్ అక్రమాస్తుల కేసులో ధర్మాన కూడా ఓ నిందితులు. అయినా సరే జగన్కు కృతజ్ఞత లేదంటున్నారు ధర్మాన అనుచరులు. ఇప్పటికే చాలా అవమానాలు ఎదుర్కొన్నామని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని ధర్మాన ప్రసాదరావు ఎదుట వాపోతున్నారు.