తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో విచారిస్తున్న కొద్ది ఒక్కో సంచలన విషయం బయటకు వస్తోంది. తొలిసారి పోలీసులు టీటీడీ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. ఇక ఆయన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ నెయ్యి సరఫరాకు వెండి ప్లేటు ఎర వేశారట. కల్తీగాళ్లతో టీటీడీ కొనుగోలు జీఎం సుబ్రహ్మణ్యం చేతులు కలిపినట్లు గుర్తించారు. కల్తీ నెయ్యి సరఫరా విషయం తెలిసీ నివేదిక తొక్కిపెట్టినట్లు గుర్తించారు.
Also Read : బాబు గారు.. ఆ మాట మర్చిపోయారా..!
సంబంధిత డెయిరీల ప్రతినిధులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేల్చారు. ప్రతిఫలంగా రూ.3.50 లక్షలు, వెండి ప్లేటు, ఫోన్ లంచం ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. వైష్ణవి డెయిరీ, బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ సంస్థలు సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీదని.. వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని అందుకే బీటా సిటోస్టెరోల్ పాజిటివ్ వచ్చిందని అప్పట్లో మైసూరు సీఎఫ్టీఆరై నివేదిక ఇచ్చింది. అప్పటి నివేదికను సుబ్రహ్మణ్యం తొక్కిపెట్టారని తేల్చిన సిట్… ఆయా సంస్థలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు 2022 ఆగస్టులో నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోలేదని పేర్కొంది.
Also Read : అయ్యన్నార్ దెబ్బకు వైవీ ఉక్కిరిబిక్కిరి
2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరా చేసేలా బోలేబాబా డెయిరీకి మరిన్ని ఆర్డర్లు ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. సుబ్రహ్మణ్యం ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్నంతకాలం ప్రీమియర్, వైష్ణవి డెయిరీలు నెయ్యి సరఫరా చేసేలా చూశారని అధికారులు తేల్చారు. ఇక ఈ కేసులో త్వరలోనే టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవల ఈ కేసులో పోలీసులు ఆయనను కూడా విచారించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటుగా మరి కొంతమంది అధికారులు కూడా అదుపులోకి తీసుకునే సంకేతాలు ఇచ్చారు సిట్ అధికారులు.

