భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఇప్పుడు ఉత్తర భారతంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. దేశంలో ఉంటూ పాకిస్తాన్ కు సహకరిస్తున్న వ్యక్తులను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు అధికారులు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఒక వ్యాపారవేత్త పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నాడని గుర్తించి, అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. పాకిస్తాన్ ఇంటర్ -సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం సరిహద్దులలో, అక్రమ రవాణా, గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు.
Also Read : సాయి రెడ్డి బంధువులే కీ రోల్.. లిక్కర్ స్కాంలో మరో సెన్సేషన్
విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడు షాజాద్ను ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ మొరాదాబాద్లో అరెస్టు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కూడా అతను పాకిస్తాన్ కు అందిస్తున్నాడని వెల్లడించారు అధికారులు. షాజాద్ గత కొన్ని ఏళ్ళుగా పాకిస్తాన్ కు పలు మార్లు వెళ్లి వచ్చాడని.. సరిహద్దుల మీదుగా సౌందర్య సాధనాలు, బట్టలు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.
Also Read : హంసపాల్ బదిలీ వెనుక ఇంత కథ ఉందా..?
భారత్ లోని ఐఎస్ఐ ఏజెంట్లకు షాజాద్ డబ్బు, దేశంలోని సిమ్ కార్డులను అందించేవాడని కూడా దర్యాప్తులో వెల్లడైంది. అతను రాంపూర్ జిల్లా మరియు ఉత్తరప్రదేశ్లోని ఇతర ప్రాంతాల నుండి స్థానికులను ఐఎస్ఐ కోసం పని చేసేందుకు పాకిస్తాన్ పంపాడని కూడా తేల్చారు. ఈ వ్యక్తుల వీసాలను ఐఎస్ఐ ఏజెంట్లు ఏర్పాటు చేశారని అధికారులు పేర్కొన్నారు. ఇక పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినందుకు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నిఘా సంస్థలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ను అరెస్టు చేసిన కొన్ని రోజులకే షాజాద్ అరెస్టు జరిగింది.

