మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. స్కూల్కి వెళ్లే పిల్లలకు మధ్యాహ్న భోజనం ఎందుకు?.. స్కూళ్లలో మధ్యాహ్న భోజనమే ముఖ్యమైపోయింది. చదువు మిజ్ఞానం అయిపోయింది.. అంటూ ఓ కార్యక్రమంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అన్నం తినేవాడికి కోడి గుడ్డు పెట్టడం ఏంటి..? బుద్ధి ఉందా లేదా..?.. చదువుకుంటే చదువుకోమనండి.. లేదంటే వెళ్లిపోమనండి. కోడిగుడ్డు కోసం స్కూల్కి వస్తారా..?.. భోజనం పెట్టి, పుస్తకాలు, యూనిఫాం ఇస్తే వాడు చదువుతాడా..? శోభనం పెళ్లి కొడుకులా మంచం ఎక్కి కూర్చొంటాడు. విద్యార్థికి ఇన్ని సౌకర్యాలు అవసరమా..?.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పని బాగా చదువు చెప్పడమే. పుస్తకాలివ్వడం, బట్టలు కుట్టించడం అన్నం పెట్టడం కాదన్నారు గరికపాటి.
Also Read : యుద్ధంపై ట్రంప్ సంచలన కామెంట్స్.. ఇక ఆగినట్లే..?
అయితే గరికపాటి చేసిన వ్యాఖ్యలపై విద్యావేత్తలు సహా అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా అంటూ గరికపాటిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కూలి పనుల కోసం తల్లిదండ్రులు వలస వెళితే వారితో పాటు పిల్లలు కూడా చదువుకు దూరం కాకుండా ఉండేందుకు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అందుబాటులోకి తీసుకువచ్చారు. అదే సమయంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, బూట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. దీంతో గిరిజన ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సంఖ్య గణనీయంగా పెరిగింది.
గరికపాటి చేసిన వ్యాఖ్యలను సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు సామాజిక కార్యకర్తలు సైతం తప్పుపడుతున్నారు. “మానవత్వం లేని పాండిత్యం వృధా. గరికపాటి వారు గతంలో దళితులకు, మహిళలకు జరిగిన అన్యాయాల పట్ల అవగాహనతో మాట్లాడారు. పెత్తందారీ, పితృస్వామ్య వ్యవస్థల తరఫున క్షమాపణ చెప్పారు. అందుకే ఆయన అంటే గౌరవం ఉంది/ ఉండేది. కానీ పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం మీద ఆయన మాట్లాడిన మాటలు వింటే అసహ్యం వేస్తుంది.
ఎన్ని శాస్త్రాలు చదివినా తన తోటి మనిషి పట్ల, పేద పిల్లల పట్ల సానుభూతి, అవగాహనా లేకపోతే ఆ పాండిత్యం దేనికి ? తగలబెట్టనా?.. ఇంట్లో పిల్లలకి భోజనం పెట్టలేని పేద తల్లిదండ్రులు చదువు ఎలా చెప్పిస్తారు? ఆ పిల్లల్ని పనిలో పెడతారు. చదువు లేకుండా ఆ పిల్లలు చాకిరీ చేస్తూ జీవితాల్ని ముగిస్తారు. కనీసం ఒక పూట భోజనం దొరుకుతుంది అంటే ఆ పిల్లలని బడికి పంపుతారు. ఇంగితం ఉండాలి కదా గరికపాటి గారూ?”.. అంటూ సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
Also Read : బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం
అయితే గరికపాటి వ్యాఖ్యలకు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం పరోక్షంగా మద్దతు తెలుపుతున్నాయి. విద్యార్థికి భోజనం పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని.. అయితే దాని పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఉపాధ్యాయులనే చూడాలని చెప్పటం ఇబ్బందిగా ఉందన్నారు. చదువు చెప్పటానికి వచ్చిన టీచర్లు కోడిగుడ్లు లెక్క రాసుకోవడం, పిల్లల ముస్తాబు పై కూడా దృష్టి పెట్టాలనడం కొంత ఇబ్బందిగా ఉందని ఉపాధ్యాయులు వెల్లడించారు. ఇస్కాన్ వంటి ధార్మిక సంస్థలకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేలా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తుందని.. ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు కూడా తొలగిపోతాయని అంటున్నారు.

