మావోయిస్టులు కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. ఆపరేషన్ కగార్ దెబ్బకు అడవుల నుంచి బయటకు వస్తున్న మావోయిస్టులు ఇప్పుడు.. సాయుధ పోరాటాన్ని విరమించి రాజకీయ పార్టీ పెట్టి రాజ్యాంగబద్ధంగా అడుగులు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున నష్టపోయింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో మావోయిస్టులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యమాన్ని ఈ సమయంలో కొనసాగించడం సాధ్యం కాదు అనే భావనలో కూడా మావోయిస్టు పార్టీ ఉంది.
Also Read : భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..!
ఇప్పటికే సైద్ధాంతిక విభేదాలతో ఇబ్బంది పడుతున్న మావోయిస్టులు.. కీలక నేతల లొంగుబాటులతో ఇబ్బంది పడుతున్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న లాంటి నేతలు ఇటీవల కాలంలో లొంగిపోయారు. కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి వంటి వాళ్ళు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ప్రాణాలు కోల్పోవడం ఆ తర్వాత కొంతకాలానికే అగ్రనేత హిడ్మా.. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంతో మావోయిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఓ కీలక ప్రకటన చేశారు.
Also Read : బీఆర్ఎస్ బాడీ లాంగ్వేజ్ మారిందా..?
ప్రజల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షల రూపాయలను ప్రజల కోసమే ఖర్చు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ సమయంలోనే తమకు రాజకీయాలపై ఆసక్తి ఉందని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రకటించడం సంచలనమైంది. ప్రస్తుతం బస్తర్ లో ఉంటున్న ఆయన.. త్వరలోనే సొంత ఊరు వరంగల్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీ అంశానికి సంబంధించి.. మాజీ మావోయిస్టులు త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే గతంలో లొంగిపోయిన మావోయిస్టులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ఇటీవల లొంగిపోయిన అగ్ర నేతలు.

