ఆంధ్రప్రదేశ్ లో గడువు పూర్తి అవుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఓటర్ల జాబితా సహా పలు కీలక అంశాలపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలపై మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ నీలం సాహ్ని లేఖలు రాసారు. 175 నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను ఈసీ నుంచి ఎన్నికల సంఘం తీసుకుంది. ఓటర్ల జాబితాలో ఉన్న అంశాలపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Also Read : బ్రేకింగ్: లిక్కర్ స్కామ్ లో అప్రూవర్లుగా కీలక నిందితులు
కొందరు ఓటర్లు ప్రాంతం మారిపోవడం, మరికొన్న చోట్ల ఓటు హక్కు ఉండటం, కొత్త ఓటర్ల నమోదు, కొందరు ఓటర్లు మరణించడం సహా అనేక అంశాలను పరిశీలిస్తోంది. దీనిపై పూర్తి కసరత్తు చేస్తోన్న ఎన్నికల కమీషన్.. తుది జాబితాను రెండు నెలల్లో ఖరారు చేసే అవకాశం కనపడుతోంది. రిజర్వేషన్ల ఖరారు తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పటికే పార్టీ క్యాడర్ ను రాజకీయ పార్టీలు సిద్దం చేస్తున్నాయి. త్వరలోనే రాజకీయ పార్టీలతో కూడా ఎన్నికల సంఘం భేటీ కానుంది.
Also Read : అక్రమ కేసులు, అక్రమాస్తుల కేసులు ఒక్కటి కాదు
ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ వద్ద 1.20 లక్షల బ్యాలెట్ బాక్సులు ఉండగా.. అదనంగా లక్ష బ్యాలెట్ బాక్సులు తెప్పించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎన్నికల కోసం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ నుంచి అదనపు సిబ్బందిని కూడా కోరే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో 2021 ఫిబ్రవరి, ఏప్రిల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఈసారి ఆ తరహా విమర్శలు రాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ ఎన్నికల గడువు.. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న ముగియనుంది. మార్చి 17న మున్సిపాలిటీల గడువు, 2026 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల గడువు ముగియనుంది. ఇక ఇదే సమయంలో కీలకమైన పంచాయతీల విలీన ప్రక్రియకు ఈ నెలాఖరుకల్లా క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది.

