ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక నేతలను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయగా, కొందరు బెయిల్పై విడుదలయ్యారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్పై బయటకు రాగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా జైల్లోనే కొనసాగుతున్నారు. మరోవైపు బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను కూడా అధికారులు అరెస్ట్ చేశారు.
Also Read : టీడీపీపై మోదీ సవతి ప్రేమ..?
ఇప్పుడు ఈ కేసులో కీలక మలుపుగా భావిస్తున్న పరిణామం వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఈడీ దృష్టి కేంద్రీకరించడమే. నేడు ఆయనను విచారిస్తున్న అధికారులు, రేపు మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరి విచారణ అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు రాజ్ కేసిరెడ్డిని విచారించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ విచారణల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.
Also Read : దావోస్లో ‘టీమ్ ఏపీ’ దూకుడు.. రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు
అయితే ఈ కేసులో తాను కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమేనని, అసలు కీలక పాత్ర పోషించింది రాజ్ కేసిరెడ్డేనని విజయసాయి రెడ్డి వాదిస్తున్నట్లు సమాచారం. ఆయన అప్రూవర్గా మారే అవకాశాలపై ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపించాయి. మరోవైపు విదేశాలకు నిధుల తరలింపు, మద్యం ఆర్డర్ల వ్యవహారం, పాలసీ రూపకల్పన వంటి అంశాల్లో విజయసాయి రెడ్డి పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధారాలు, సాక్ష్యాలతోనే ఈడీ అధికారులు ఆయనను లోతుగా విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

