ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు.. జనాభా పెరుగుదల విషయంలో ప్రజలను చైతన్య పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. తన ప్రసంగాలలో జనాభా పెరుగుదల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్రంలో జనాభాను పెంచే చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత రోజుల్లో సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని.. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాను సర్కార్ సిద్దం చేస్తోంది.
Also Read : యూకేలో అడుగుపెట్టిన మోడీ.. కీలక ఒప్పందాల దిశగా అడుగులు..!
నిపుణులు, మేధావుల సూచనలతో ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేస్తోంది. సంతానోత్పత్తి రేటును పెంచే చర్యల్లో భాగంగా పలు ప్రోత్సాహకాలను ముసాయిదాలో ప్రతిపాదిస్తోంది. ముసాయిదాలోని ప్రతిపాదనలు ఒకసారి చూస్తే, ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉంటే ఆ కుటుంబంకు ఆస్తి పన్ను మినహాయింపు ఉంటుందని సమాచారం. ప్రసూతి సెలవులు ఆరు నెలలు నుంచి 12 నెలలకు పెంచుతోంది. మూడో బిడ్డ ఉంటే అదనంగా 50 వేలు ప్రోత్సాహకం అందించనుంది. నాలుగో బిడ్డకు కూడా ఇది కొనసాగిస్తారు.
Also Read : ఆపరేషన్ దుబాయ్.. లిక్కర్ కేసులో కీలక అడుగు..!
పిల్లలు పుట్టేందుకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ట్రీట్మెంట్ కోసం ఆర్ధిక సహాయం అందించేందుకు కూడా సర్కార్ సిద్దమైంది. అలాగే తల్లులకు వర్క్ ఫ్రం హోం కల్పించాలని ముసాయిదాలో ప్రస్తావించారు. తల్లులకు పిల్లల కోసం క్రెచ్లు ఏర్పాటు చేస్తారు. గ్రామ స్థాయిలో ప్రచారం పెంచేందుకు కూడా చర్యలు చేపట్టనుంది సర్కార్. పిల్లలు వద్దనుకునే జంటలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వారు జీవితాన్ని ఎంజాయ్ చేసే ఉద్దేశంతో పిల్లలు వద్దు అనుకోవడం కూడా ప్రమాదకరంగా మారడంతో సర్కార్ ఈ విషయంలో అవగాహన కల్పించనుంది.

