ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఆంధ్రప్రదేశ్ ను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చూసాం. రాష్ట్రం మొత్తం కూడా తుఫాను ప్రభావంతో భారీగా పంట నష్టం, కొన్ని ప్రాంతాల్లో ఆస్తి నష్టం వంటివి జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టం పూర్తిగా తప్పిందని చెప్పాలి. ఒకరిద్దరు మాత్రమే ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. ఇక పునరావస కేంద్రాలు, వైద్య శిబిరాలు వంటివి ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి బాధితులను వేగంగా అధికారులు తరలించే చర్యలు తీసుకున్నారు.
Also Read : భారతి సిమెంట్ మేనేజర్ పై కేసు..!
అయితే దీనిపై సోషల్ మీడియాలో ఓ వర్గం తప్పుడు ప్రచారం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలతో పాటుగా, తుఫాను తీవ్రత అంతగా లేదని, కావాలనే సీఎం చంద్రబాబు హడావుడి చేస్తున్నారని.. వైసిపి కార్యకర్తలు కొందరు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు. అలాగే కొన్ని వెదర్ రిపోర్ట్ లు అంటూ, కొన్ని స్క్రీన్ షాట్లను కూడా వైరల్ చేసే ప్రయత్నం చేశారు. తుఫాను ఎటో వెళ్లిపోతుందని, రాష్ట్రం వైపుగా రావటం లేదని కామెంట్ చేశారు. అలాగే పునరావస కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలపై కూడా కొంత ప్రచారం జరిగింది. నదుల్లో వరదలపై కూడా కొందరు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఫేస్బుక్, లేదా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే ప్రభుత్వం గుర్తిస్తుందని కొందరు వాట్సాప్ ద్వారా వైరల్ చేయటం మొదలుపెట్టారు.
Also Read : మావోయిస్టుల వద్ద ఎన్ని కేజీల బంగారం ఉందంటే..?
ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లగా.. హోం శాఖకు కీలక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. తుఫాన్ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన వారిని గుర్తించాలని, వాట్సాప్ గ్రూపులో వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో కర్నూలు బస్సు ప్రమాదం విషయంలో కూడా తప్పుడు ప్రచారం జరిగిందని, బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్న వైసిపి నేతలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా సీఎం ఆదేశించినట్లు సమాచారం. అలాగే వాట్సాప్ గ్రూపులలో తప్పుడు ప్రచారం చేసే కొందరు అధికారులను కూడా గుర్తించాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.

