ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాయి. దీనితో ఈ రెండు పార్టీలు తెలంగాణా మీద కూడా ఫోకస్ చేయాలని భావిస్తున్నట్టుగా కనపడుతోంది. టీడీపీ తెలంగాణాలో అధికారానికి దూరమై దాదాపుగా 20 ఏళ్ళు దాటిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అయితే ఒక్కసారి కూడా తెలంగాణాలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. గతంలో బిజెపి కారణంగా పోటీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం అవకాశాన్ని వదులుకోవద్దని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో టిడిపి, జనసేన రెండు పార్టీలు తెలంగాణాలో బలోపేతం కావడం కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన ఇప్పుడు బలంగానే ఉన్నాయి. తెలంగాణాలో బిజెపి తో కలిసి పోటీ చేయడం దాదాపుగా ఖరారు అయిందనే వార్తలు వస్తున్నాయి. ఇక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణాలో టీడీపీ మీద ఫోకస్ పెడుతున్నారు. ఈరోజు తెలంగాణ నాయకులతో సమావేశం సందర్భంగా అన్ని కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కమిటీల స్థానంలో జిల్లాల వారీగా అడహక్ కమిటీలు వేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దానితో పాటే తక్షణమే పార్టీ సభ్యత్వాలు నమోదు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటానకి సమావేశానికి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి చంద్రబాబు తెలియచేసారు. తెలంగాణాలో ప్రస్తుత ప్రభుత్వం పై తక్షణమే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని నాయకులకు దశా నిర్దేశం చేసిన నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాటం చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు, గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద చంద్రబాబు కూడా సీరియస్ గానే ఉన్నారు.
ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనంగా ఉండటంతో ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. వారిలో కొంతమంది టీడీపీలోకి వస్తారని క్యాడర్ అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వచ్చాయని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

