ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. చంద్రబాబు సర్కార్ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే తొలి అడుగు పేరుతో పర్యటనలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తున్నారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తున్నారు చంద్రబాబు. అందులో భాగంగానే అర్హులైన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నవారిలో కొంత మందిని తప్పించేందుకు కూడా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ వివరాలు ఎక్స్క్లూజవ్గా ఆంధ్రాన్యూస్9 ప్రేక్షకుల కోసమే.
Also Read : మరో మైలురాయిని అధిగమించిన శ్రీ సిటీ..!
ప్రస్తుత ఏపీ మంత్రివర్గంలో 25 మంది సభ్యులున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో 17 మంది మొదటిసారి మంత్రులుగా నియమితులయ్యారు. తన శైలికి భిన్నంగా పూర్తిగా యువతకు ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. అలాగే ఎన్నికల సమయంలో కొంతమందికి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చారు. అయితే ఇప్పుడు కొంతమంది మంత్రులపై విమర్శలు వస్తున్నాయి. అలాగే పార్టీకి చెందిన కొందరికి కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంది. దీంతో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కృష్ణా జిల్లా నుంచి మంత్రిగా కొనసాగుతున్న కొల్లు రవీంద్రపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఆయనను రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. బీసీ అనుబంధ సంఘాలకు చెందిన నేతగా పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలతో కూడా కొల్లు రవీంద్రకు సత్సంబంధాలున్నాయి. అందుకే ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న పల్లా శ్రీనివాసరావును మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖాయమైంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. అప్పుడే పల్లా పేరును చంద్రబాబు ప్రకటించారు కూడా. కొల్లును తొలగించి.. ఆయన స్థానంలో పల్లాను తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read : మంత్రులకు కౌంట్ డౌన్ స్టార్ట్.. చంద్రబాబు సంచలన కామెంట్స్
ఇక మరో మంత్రి కొలుసు పార్థసారధిపై వేటు ఖాయమంటున్నారు పార్టీ నేతలు. సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు పార్థసారధి. అయితే ఆయనకు పెనమలూరుకు బదులుగా నూజివీడు టికెట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆయనకు కీలకమైన గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ కేటాయించారు కూడా. ఇప్పుడు ఏడాది తర్వాత కొలుసుపై వేటు వేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆయన స్థానం ఎవరితో భర్తీ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇద్దరు నేతలకు మంత్రి పదవులు వస్తాయని అంతా భావించారు. వారిలో ఒకరు అయ్యన్నపాత్రుడు, మరొకరు రఘురామ కృష్ణరాజు. ఈ ఇద్దరు నేతలు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత చింతకాయల అయ్యన్నపాత్రుడిని స్పీకర్ స్థానంలో ఉంచారు. అలాగే రఘురామ కృష్ణరాజుకు డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. అయితే తాజాగా ఈ ఇద్దరి పోస్టులు మారుతాయనే మాట బలంగా వినిపిస్తోంది. అయ్యన్నపాత్రుడిని మంత్రి చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. ఆయన స్థానంలో రఘురామను స్పీకర్గా నియమించడం ఖాయం. అలా కాకపోతే.. రఘురామను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడే మరో విషయంపై పార్టీలో, ప్రభుత్వంలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. జనసేన నేత నాగేంద్రబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు చంద్రబాబు. కానీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది కానీ.. మంత్రివర్గంలోకి తీసుకోలేదు. తాజా విస్తరణలో నాగేంద్రబాబుకు ఛాన్స్ ఉంటుందా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
Also Read : తీరు మారలేదు.. కారణం ఇదేనా..!
ఇక ప్రస్తుత మంత్రివర్గంలో కొంతమందిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తన పీఏపై ఆరోపణలు రావడంతో తొలగిస్తున్నట్లు హోమ్ మంత్రి అనిత స్వయంగా ప్రకటించారు. ఇదే మాదిరిగా మరి కొందరిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని తొలగిస్తారనే ప్రచారం నడుస్తోంది. మరి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఎవరుంటారో.. ఎవరిని వూష్టింగ్ చేస్తారో చూడాలి.

