ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న భద్రతా సిబ్బందిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న భద్రతను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నప్పటికీ ఆయన రక్షణ వలయం పరిమితంగానే ఉంటోంది. ప్రస్తుతం ఆయన భద్రత కోసం ఉన్న సిబ్బంది కేవలం 121 మంది మాత్రమే ఉంటారు. గత సీఎం జగన్తో పోలిస్తే ఎనిమిదో వంతు సిబ్బందే ఇప్పుడు విధుల్లో ఉండటం గమనార్హం. దీనివల్ల భద్రతాపరమైన ఖర్చు కూడా భారీగా తగ్గిందని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి.
Also Read: తెలుగుదేశం.. పడిలేచిన కెరటం..!
గతంలో జగన్ కాన్వాయ్లో 17 వాహనాలు ఉండగా ఇప్పుడు 11 మాత్రమే వినియోగిస్తున్నారు. ఎన్ఎస్జీ రక్షణలో ఉన్న చంద్రబాబుకు ఇంకా ఎక్కువ భద్రత సమకూర్చే అవకాశం ఉన్నా ఆయన అంత అవసరం లేదని వారించడంతో కనీస సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు అధికారులు. చంద్రబాబు నివాసంలో ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ ప్రతిరోజూ నిర్వహించే జరిగే ప్రజా దర్బార్కు వందల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారట. వారికి ఏ ఇబ్బంది రాకుండా భద్రతా సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఖర్చు తగ్గిస్తున్నారు. కొన్ని సంఘాలు అక్కడ చిన్న చిన్న ధర్నాలు నిర్వహిస్తున్నా, పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పి పంపించేయడం జరుగుతోంది.
Also Read: వర్మపై ఏపీ సర్కార్ రివేంజ్…?
చంద్రబాబు తన భద్రతకు సాంకేతిక పరిజ్ఞానం జోడించాలని సూచించడంతో పోలీసు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. దీనితో భద్రత ఖర్చు తగ్గుతోంది. దీంతో తక్కువ సిబ్బందితోనే భద్రత కల్పించడం సాధ్యమైంది. ఈ డ్రోన్ ప్రతి రెండు గంటలకు ఒకసారి పైకి ఎగిరి చుట్టూ ఉన్న పరిస్థితులను వీడియో తీయడం.. ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే పర్యవేక్షక విభాగానికి సమాచారం అందించడం జరుగుతోంది. ఈ డ్రోన్ నిర్దేశిత సమాయానికి తానే ఎగిరి నిర్దేశిత ప్రాంతంలో తిరగడంతో పాటు తిరిగి వచ్చాక తానే చార్జింగ్ కూడా పెట్టుకోవడంతో సిబ్బందికి పని తగ్గుతోంది. పర్యటనలకు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కూడా భద్రత ఎక్కువగా వద్దని చంద్రబాబు ఆదేశిస్తున్నారు.