తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ హాట్గా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. నలుగురు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన టీపీసీసీ పెద్దలు.. ఢిల్లీకి పంపినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక దాదాపు తుది దశకు చేరుకుంది. 2023 ఎన్నికల్లో హైదరాబాద్ జంట నగరాల్లో కనీసం ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. దీంతో ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది కాంగ్రెస్ పెద్దల మాట. అటు బీఆర్ఎస్ కూడా ఉప ఎన్నికలో విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ఎంపిక చేశారు. సానుభూతి ఓట్లు వస్తాయనేది గులాబీ నేతల ఆలోచన. అదే సమయంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఇప్పటికే పదే పదే చెబుతున్నారు. అసహనంతో ఉన్న ప్రజలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీర్పు ద్వారా కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి చెబుతారనేది కారు పార్టీ నేతల మాట.
Also Read : ఈ సారైన ముహూర్తం బలంగా ఉందా..?
ఇక తెలంగాణలో ఎప్పటి నుంచో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి చంద్రబాబు ఏపీకే పరిమితమయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు సైలెంట్గా పార్టీ మారారు. ఇక 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కూడా గులాబీ పార్టీలో చేరిపోయారు. దీంతో నాటి నుంచి టీడీపీ పూర్తిగా ఢీలా పడిపోయింది. సరైన నేత లేకపోవడంతో క్యాడర్ అంతా సైలెంట్ అయిపోయింది. ప్రతి ఎన్నికల సమయంలో సమావేశాలు జరుపుతున్నారు తప్ప.. పోటీకి మాత్రం ముందుకు రావటం లేదు.
Also Read : తెలంగాణలో దున్నపోతు దుమారం..!
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. ఆ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున ప్రచారం కూడా చేయలేదు. ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగించాలని నేతలు సూచించారు. తాజాగా తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోందని.. బీజేపీ నేతలతో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతోందని చంద్రబాబుకు నేతలు సూచించారు. కాబట్టి.. ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉంటే బెటర్ అనే సలహా కూడా ఇచ్చారు. ఇందుకు ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నేతలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ తరఫున జయసుధ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పోటీ చేసి ఓడిపోతే పార్టీ పరువు పోతుందనే అభిప్రాయం వెల్లడించారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరంగా ఉండటమే బెటర్ అనే సూచనకు చంద్రబాబు కూడా ఓకే చెప్పారు. మరోవైపు బీజేపీ అడిగితేనే ఎన్నికల్లో ప్రచారం, మద్దతు అంశాలు పరిశించాలని.. అప్పటి వరకు ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలు చేయవద్దని కూడా నేతలకు చంద్రబాబు సూచించారు.