రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే విషయంలో దూకుడుగా అడుగులు వేస్తోన్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.. పలుమార్లు ఢిల్లీ వెళ్లి వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్ళారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో సిఎం భేటీ కానున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల, పయ్యావుల, టీడీపీ ఎంపీలు పాల్గొననున్నారు. ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
Also Read : మళ్లీ తెరపైకి వైఎస్ఆర్ బొమ్మ..!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా తొలగించాలని చంద్రబాబు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. జాతీయ ప్రాజెక్టు పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు నిలిపివేత ఉత్తర్వులను శాశ్వతంగా ఎత్తివేయండని ఏపీ సర్కార్ డిమాండ్ చేస్తోంది. పోలవరం కుడి, ఎడమ కాలువల విస్తరణకు ఖర్చు చేసిన అదనపు వ్యయాన్ని తిరిగి చెల్లించాలని చంద్రబాబు కోరారు. రెండో దశ పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు అనుమతి, ఆర్థికసాయం చేయాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరనున్నారు.
Also Read : ఆయన కోసం కొత్త పోస్టు సృష్టిస్తున్నారా..?
అలాగే కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో కూడా సిఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం కనపడుతోంది. అలాగే కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సిఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం కనపడుతోంది. అమరావతి పనులకు సంబంధించి ఆమెతో చర్చించనున్నారు. అలాగే నితిన్ గడ్కారి, అశ్వినీ వైష్ణవ సహా పలువురు కేంద్ర మంత్రులను కూడా సిఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

