తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు-2026 నిర్వహణకు ఈసారి విజయనగరం జిల్లా ముస్తాబవుతోంది. గత ఏడాది కడపలో ఈ మహానాడు కార్యక్రమాన్ని అధిష్టానం నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 28న ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన టీడీపీ అధిష్టానం, ఇందుకు వేదికగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మే 27, 28, 29 తేదీల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. నెల్లిమర్లలో గత ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి కూటమి అభ్యర్థిగా గెలిచిన సంగతి తెలిసిందే.
Also Read : త్రిషాతో రిలేషన్.. విజయ్ ఫుల్ క్లారిటీ..!
ఇక టీడీపీ జిల్లా ముఖ్య నేతలు కలిసి రేపు క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేయాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. నెల్లిమర్ల నియోజకవర్గం విజయనగరం నగరానికి ఆనుకుని ఉండటం, జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో లక్షలాది మంది తరలివచ్చే మహానాడుకు ఇక్కడి స్థలాలు అనువుగా ఉంటాయని పార్టీ భావిస్తోంది. నెల్లిమర్లలో మహానాడు నిర్వహించడం ద్వారా జిల్లాలోని కూటమి బలాన్ని చాటిచెప్పాలని నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ఈ కార్యక్రమం తన నియోజకవర్గంలో జరగనుండటంతో ఏర్పాట్లపై తన వంతు సహకారం అందించే అవకాశం కనపడుతోంది.
Also Read : పాకిస్తాన్ ను కామెడి పీస్ చేసిన ఇరాన్..!
రేపటి జిల్లా నేతల పర్యటనలో భాగంగా సభా ప్రాంగణం, పార్కింగ్, విడిది సౌకర్యాలను నేతలు పర్యవేక్షించి అధిష్టానానికి నివేదిక పంపనున్నారు. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం జిల్లాలో మహానాడు నిర్వహించడం ద్వారా కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపవచ్చని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల తర్వాత జరుగుతున్న ఈ మహానాడులో ఏపీ అభివృద్ధిపై కీలక తీర్మానాలు చేసే అవకాశం ఉంది. అయితే జిల్లాలో టీడీపీ నేతల పని తీరుపై విమర్శలు వస్తున్న సమయంలో పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

