సీఎం చంద్రబాబు ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులను అందలం ఎక్కించినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందనే మాట ఇప్పుడు అటు ప్రభుత్వంలో, ఇటు రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. నిజానికి చంద్రబాబు అంటే కేవలం పని తీరుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది దగ్గరగా చూసిన వారికి తెలుసు. కానీ.. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ నేతలు మాత్రం.. ఆయనకు కులాన్ని ఆపాదిస్తున్నారు. కేవలం సొంత కులానికి చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది చంద్రబాబుపై ఉన్న ప్రధాన ఆరోపణ. అయినా సరే.. అవేవీ ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు.
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధానా కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్ను పక్కన పెట్టిన చంద్రబాబు.. ఆయన కంటే జూనియర్ అయిన విజయానంద్ను నియమించారు. నిజానికి సర్వీస్ నుంచి రిటైర్ అయినా కూడా మరో మూడు నెలలు సర్వీస్ పొడిగించారు కూడా. నిజానికి సాయిప్రసాద్ కమ్మ కులానికి చెందిన అధికారి. విజయానంద్ యాదవ కులానికి చెందిన అధికారి. విజయానంద్కు సీఎస్ పోస్టుతో పాటు అత్యంత ప్రాధాన్యత కలిగిన విద్యుత్ శాఖను కూడా అప్పగించారు. సీనియారిటీ, కులం పట్టించుకోకుండా.. బీసీ వర్గం, యాదవ కులానికి చెందిన అధికారికి కీలక బాధ్యతలు అప్పగిస్తే.. ఇప్పుడు అదే సామాజిక వర్గం నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Also Read : మొదటి దెయ్యం ఆయనే.. కవిత మరో సెన్సేషన్..!
విజయానంద్కు కీలక పదవి ఇచ్చినా కూడా చంద్రబాబుకు యాదవ సామాజిక వర్గం అండగా నిలవటం లేదు. బీసీ నేతగా పదే పదే చెప్పుకునే రామచంద్రయాదవ్తో పాటు ఇతర యాదవ సామాజిక వర్గం నేతలు, పెద్దలు కనీస మద్దతు కూడా ఇవ్వటం లేదు. నిజానికి తన కంటే సీనియర్లను కూడా చంద్రబాబు పక్కన పెట్టారని.. విజయానంద్ కనీసం ఒక్కసారి కూడా వ్యాఖ్యానించలేదు. తనను కలిసేందుకు వచ్చిన యాదవ సామాజిక వర్గం నేతలు, సంఘాల ప్రతినిధులతో విజయానంద్ చెప్పిన రుజువులు కూడా లేవు. అటు యాదవ సంఘం నేతలు కూడా చంద్రబాబు తమకు గుర్తింపు ఇవ్వటం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు.
ఇక యాదవ సామాజికవర్గానికే చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణయ్యను ప్రస్తుతం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్గా నియమించారు. ఆయన రిటైర్డ్ అయినప్పుడు కూడా ఐదేళ్ల పాటు ఏపీఐఐసీ చైర్మన్గా, ప్రభుత్వ సలహాదారుగా గతంలో నియమించారు. యాదవ కులానికి చెందిన వారికే ప్రాధాన్యత పోస్టులిచ్చారని కనీసం ఒక్కసారి కూడా వాళ్లు ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. పైగా గతంలో కృష్ణయ్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ను టీటీడీ ఛైర్మన్ను చేసినా కూడా.. తలసాని శ్రీనివాసయాదవ్ వంటి నేతలు చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కృషి చేశారు కూడా.
Also Read : యూరప్ దేశాలతో కీలక ఒప్పందం.. ఈ ధరలు తగ్గుతాయా..?
అటు రాజకీయంగా కూడా యాదవ సామాజిక వర్గానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్థసారధికి మంత్రి పదవి, పల్లా శ్రీనివాస్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, యనమల దివ్యకు ప్రభుత్వ విప్ పదవి, యనమల రామకృష్ణుడుకు పార్టీ పొలిట్బ్యూరో పదవి, పుట్టా సుధాకర్ యాదవ్కు ఎమ్మెల్యే, పుట్టా మహేష్ యాదవ్కు ఎంపీగా అవకాశం కల్పించారు. ఓ వైపు యాదవ సామాజికి వర్గానికి చంద్రబాబు అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇస్తున్నా కూడా.. యాదవ సామాజిక వర్గం నాయకులు, సంఘాలు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా చంద్రబాబుకు అండగా నిలిచిన దాఖలాలు కనిపించలేదు. పైగా రామచంద్రయాదవ్ వంటి నేతలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. అయినా సరే.. సొంత పార్టీలోని యాదవ సామాజిక వర్గం నేతలు దీనిని ఖండించటం లేదు.

