రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు సంబంధించి చిన్న చిన్న కోరికలు మనం వింటూనే ఉంటాం. అందులో ప్రధానమైనది తిరుమల దర్శనాలు. కలియుగ దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఇచ్చే లెటర్ల కోసం కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏడాదికి ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని.. అందుకోసం లెటర్ ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధులను వేడుకొంటూ ఉంటారు. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కార్యకర్తలకు కనీస కోరికల్లో ఒకటి.
Also Read : అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ
అయితే ఈ విషయంలో టిడిపి పై కొంత విమర్శలు వస్తున్నాయి. టిడిపి ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ.. కార్యకర్తలకు దర్శనం లెటర్ లు ఇవ్వడం లేదు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. మంత్రుల నుంచి ఎమ్మెల్సీల వరకు ఎవరు కూడా ఈ విషయంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇచ్చిన వారికే మళ్ళీ ఇవ్వడం, సన్నిహితులకు ఇచ్చుకోవడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి అని ఆరోపణలు వినపడుతున్నాయి. 300 రూపాయల దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం వంటివి కార్యకర్తలు ప్రజాప్రతినిధులను అడుగుతూ ఉంటారు.
Also Read : బెజవాడ పోలీసుల సంచలన నిర్ణయం..!
ఈ విషయంలో కార్యకర్తలకు న్యాయం జరగటం లేదని విమర్శలు వినపడుతున్నాయి. తాము ఎన్నిసార్లు అడిగినా సరే మూడు నెలలు లేదా నాలుగు నెలలు ఖాళీ లేవని సమాధానం వస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఎంపీలు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని.. మరి కొంతమంది వాటిని సన్నిహితుల చేతుల్లో పెట్టి అక్కడే అడగాలంటూ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తెలంగాణలో ఉన్న వారికి కొంతమంది ఎమ్మెల్యేలు లెటర్ లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కూడా లెటర్లు ఇవ్వకపోతే.. ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లో పనిచేసే వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి కనీసం కార్యకర్తలకు ఇచ్చే ఏర్పాటు జరగాలని.. ప్రతివారం కనీసం మూడు లెటర్లు కార్యకర్తలకు కేటాయించాలని సూచిస్తున్నారు.

