వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. అసలే ఓటమి బాధతో ఉన్న జగన్.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఇప్పటికే మదనపడిపోతున్నారు. హోదా ఇస్తేనే సభకు వచ్చి తన వాణి వినిపిస్తా అంటూ సాధ్యం కాని మాటలు చెబుతున్నారు. వాస్తవానికి 11 స్థానాలు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం సాధ్యం కాదని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇప్పటికే తేల్చేశారు. అయినా సరే అదే కావాలని గగ్గొలు పెడుతున్నారు.
Also Read : మాకు ఈ పదవులు వద్దు సార్..!
ఇక జగన్ తీరు నచ్చక ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు వైసీపీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇలాంటి వారికి బాలినేని శ్రీనివాస్, ఆళ్ల నాని వంటి మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఇక జగన్కు తొలి నుంచి అత్యంత సన్నిహితంగా ఉండే విజయసాయిరెడ్డి కూడా పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. త్వరలో మరికొందరు వైసీపీకి కీలకనేతలు కూడా పార్టీ మారే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.
2024 నాటికి వైసీపీకి ఉభయ పార్లమెంట్ సభల్లో 17 మంది సభ్యులున్నారు. వారిలో నలుగురు లోక్సభ సభ్యులు కాగా.. మిగిలిన 13 మంది రాజ్యసభకు ఎన్నికైన వారే. రాజ్యసభ సభ్యుల్లో ఇప్పటికే నలుగురు పార్టీకి రాజీనామా చేశారు. విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు వైసీపీకి దూరమయ్యారు. లోక్సభకు ఎన్నికైన నలుగురిలో ఇద్దరు సొంత సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అలాగే ప్రస్తుతం రాజ్యసభలో కూడా సరిగ్గా ఏడుగురు సభ్యులున్నారు. వీరిలో నలుగురు రెడ్డి సామాజిక వర్గం నేతలే. అటు అసెంబ్లీలో, ఇటు పార్లమెంట్లో జగన్ పార్టీకి సరిగ్గా 11 మంది సభ్యులే ఉన్నారు.
Also Read : గ్లాస్ స్కై వాక్ పాలిట్రిక్స్.. మా వల్లే అంతా..!
ప్రస్తుతం పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల్లో సొంత సామాజిక వర్గం నేతలు జగన్ తీరు పట్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీలో జగన్ మాటే శాసనం. కాదంటే.. వాళ్లకు పుట్టగతులు కూడా ఉండవనేది బహిరంగ రహస్యం. అలాంటి జగన్ మాటను ఎదిరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2024లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. కండీషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు మిథున్. అలాగే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. త్వరలో అరెస్టు ఖాయమనే మాట వినిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు తెలిపారు. దీనిపై సొంత పార్టీ ఎంపీలు గుర్రుగా ఉన్నారు. తెలుగు వాడు పైగా సొంత సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కాదని.. ప్రత్యర్థికి ఎలా ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ గెలుపునకు ప్రధాన కారణం రెడ్డి సామాజిక వర్గం. అందుకే వైసీపీ ఎంపీలంతా సుదర్శన్ రెడ్డికి ఓటు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. మరి ఫలితాలు వెలువడిన తర్వాత కానీ.. వైసీపీ ఎంపీలు ఎవరికి ఓటు వేశారో తేలుతుంది.