బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈరోజు రాజీనామా చేసి, దేశం నుంచి పారిపోయారు. నెల రోజుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో దేశం విడిచిపెట్టి పారిపోయారు ఆమె. ఈ తరుణంలో ఆర్మీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉస్-జమాన్ తెలిపారు. 76 ఏళ్ళ హసీనా… తన సోదరితో కలిసి బంగ్లాదేశ్ సైనిక విమానంలో ప్రయాణించినట్లు సమాచారం.
ఎయిర్లైన్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ నుండి అందిన ఫుటేజ్ ఆధారంగా… బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన విమానం – లాక్హీడ్ సి-130జే హెర్క్యులస్ అనే హెలికాప్టర్ మన దేశంలోని ఝార్ఖండ్ మీదుగా ఎగిరినట్టు కనపడింది. అంతకు ముందు వచ్చిన వార్తల ప్రకారం హసీనా పశ్చిమ బెంగాల్ వెళ్తున్నారనే ప్రచారం జరిగింది. కాని హెలికాప్టర్ అక్కడ ఆగలేదని గుర్తించారు. దాదాపు 15 ఏళ్ళ నుంచి ఆమె ప్రధానిగా ఉన్నారు. ప్రభుత్వంపై గత కొన్నాళ్ళుగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నా ఆమె పాలనలో మార్పేమీ కనపడలేదు.
ఇక ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో నిన్న పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. దాదాపు 100 మందిపైగా ఈ హింసలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రస్తుతం త్రిపుర రాష్ట్రంలో తల దాచుకున్నారని సమాచారం. ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది సూచనల మేరకు ఆమె భారత్ వచ్చినట్టు తెలుస్తోంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు వ్యతిరేకంగా గత నెలలో ప్రారంభమైన నిరసనలు ఆమె రాజీనామా చేసే వరకు వెళ్ళాయి. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో సగానికిపైగా కొన్ని వర్గాలకు రిజర్వ్ చేసిన కోటా స్కీమ్ను తిరిగి ప్రవేశపెట్టడంపై నిరసనలు జరిగాయి.