– ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం
– సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్ షోలకు హాజరు
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ (Special Visits Program)లో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఇటీవల మంత్రి లోకేష్ కు ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ ను కోరింది. ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19-24 మధ్య ఆస్ట్రేలియాలోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి అక్కడి అధునాతన విద్యావిధానాలపై అధ్యయనం చేస్తారు. దీంతో పాటు నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతూ రోడ్ షోల్లో పాల్గొంటారు.
Also read : బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంచలన మార్పులు..!
ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం 19వ తేదీ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సిడ్నీ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 20వ తేదీ ఉదయం 9 గంటలకు రాండ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యాన న్యూసౌత్ వేల్స్ ఎంపీలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు ఆస్ట్రేలియా స్కిల్స్ & ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్ తో కలిసి TAFE NSW Ultimo క్యాంపస్ ను సందర్శిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు NSW పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు.
Also Read : ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్..? బయటకు రాని టీటీడీపీ నాయకులు
21వ తేదీన ఉదయం 8.30 గంటలకు పర్రమట్టలో సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా నిర్వహించే సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ (CIAR) ఆక్వా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. 11 గంటలకు వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు న్యూసౌత్ వేల్స్ ఇన్నొవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అనౌలాక్ చాంథివోంగ్, స్కిల్స్, టెరిటరీ ఎడ్యుకేషన్ మంత్రి స్టీవ్ వాన్ తో సమావేశమవుతారు.
22వ తేదీన ఉదయం 9 గంటలకు గోల్డ్ కోస్ట్ సౌత్ పోర్టులోని గ్రిఫిత్ యూనివర్సిటీని సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బ్రిస్బేన్ లో క్వీన్స్ లాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 3 గంటలకు క్వీన్స్ ల్యాండ్ మంత్రితో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ లో అధునాతన స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై ఆర్కిటెక్ట్ లీడర్ షిప్ టీమ్ తో భేటీ అవుతారు. 23వ తేదీ ఉదయం 9.30 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ మెల్ బోర్న్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విక్టోరియన్ స్కిల్స్ మంత్రి బెన్ కరోల్, ఎకనమిక్ గ్రోత్ & జాబ్స్ మంత్రి డానీ పియర్సన్ తో సమావేశమవుతారు.
Also read : రాజకీయాల్లోకి మరో వారసుడు.. కొడుకుని పరిచయం చేసిన కవితక్క
సాయంత్రం 4.30 గంటలకు యర్రా వ్యాలీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ ఇండస్ట్రీని సందర్శించి, అనంతరం ట్రెజరీ వైన్స్ ఎస్టేట్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 24వ తేదీన ఉదయం 9గంటలకు మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియన్ ట్రేడ్ ఇన్వెస్ట్ మెంట్ కమిషన్ ఆధ్వర్యాన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 11.30 గంటలకు మెల్ బోర్న్ గ్రాండ్ హయత్ హోటల్ లో ఏఐబీసీ ఆధ్వర్యాన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విక్టోరియా క్రికెట్ గ్రౌండ్ ను సందర్శించి స్పోర్ట్స్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. 24వ తేదీ రాత్రి మెల్బోర్న్ నుంచి బయలుదేరి 25వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.