కర్నూలు జిల్లా వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. 2019 ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ… ఐదేళ్ల తర్వాత కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. ఇందుకు ప్రధాన కారణం నేతల మధ్య ఆధిపత్య పోరు అనేది బహిరంగ రహస్యం. ప్రధానంగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు ఎవరికి మద్దతివ్వాలో తెలియక సతమతమవుతున్నారు. జిల్లాలోని కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో వైసీపీ ఇంఛార్జుల తీరుపై పార్టీ నేతలు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఇద్దరు ఇంఛార్జులు స్థానికేతరులు కావడం, ఇద్దరూ ఉన్నత విద్యావంతులు కావడంతో నియోజకవర్గంలో కనిపించటం లేదనే అపవాదు మూటగట్టుకున్నారు. చివరికి పార్టీ సూచించిన కార్యక్రమాలకు కూడా ఇద్దరు నేతలు దూరంగా ఉంటున్నారు. దీంతో వీరి కోసం గత ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు వైసీపీ ఇంఛార్జుల జాడ లేదంటూ ఇటీవల సొంత పార్టీ నేతలే అధినేతకు ఫిర్యాదు చేశారు. చివరికి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన ఆదిమూలపు సతీష్కు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడుమూరు టికెట్ ఇచ్చారు జగన్. ఎన్నికలప్పుడే ఈ విషయంపై పార్టీ శ్రేణులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. స్థానికుడైన విక్రమ్కుమార్కే టికెట్ ఇవ్వాలంటూ తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా కూడా చేశారు. అయితే ఎన్నికల తర్వాత విక్రమ్కు సముచిత స్థానం ఇస్తానంటూ జగన్ హామీ ఇవ్వడంతో అప్పట్లో ఈ గొడవ సద్దుమణిగింది. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు కావడంతో.. స్థానిక నేతలు ఎదురు చెప్పలేకపోయారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత సతీష్ అడ్రస్ లేకుండా పోయారు. తిరిగి మార్కాపురం చేరుకున్నారు. తన అన్నతో కలిసి విద్యా సంస్థలు చూసుకుంటున్నారు. అంతే తప్ప కోడుమూరు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదంటున్నారు స్థానిక వైసీపీ నేతలు.
Read Also : తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వెనుక ప్రత్యేకత ఇదే..!
ఇక కడప జిల్లాకు చెందిన ధారా సుధీర్కు నందికొట్కూరు టికెట్ కేటాయించారు వైఎస్ జగన్. ఈ నియోజకవర్గంలో తొలి నుంచి బైరెడ్డి సిద్ధార్థరెడ్డిదే పెత్తనం. అప్పటి వరకున్న ఎమ్మెల్యేతో విబేధాలు రావడంతో… ఆయన స్థానంలో ధారా సుధీర్ను ఎన్నికల బరిలో నిలిపారు జగన్. అయితే స్థానిక పరిస్థితులు, నేతల మధ్య ఇబ్బందుల కారణంగా ఎన్నికల్లో ధారా సుధీర్ ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి సుధీర్ నందికొట్కూరు నియోజకవర్గంలో కనిపించడం లేదు. వృత్తి రీత్యా వైద్యుడు కావడంతో.. సొంత ఆసుపత్రి నిర్వహణపైనే సుధీర్ దృష్టి పెట్టారని.. అందుకే నందికొట్కూరుకు దూరంగా ఉంటున్నారనేది నియోజకవర్గం వైసీపీ నేతల మాట. చివరికి గత ప్రభుత్వంలో శాప్ ఛైర్మన్గా కీలక పదవి నిర్వహించిన సిద్దార్ధరెడ్డి కూడా ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు లోకల్ లీడర్లు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. నియోజకవర్గంలో వైసీపీకి మనుగడ కష్టమంటున్నారు పార్టీ శ్రేణులు. సాధ్యమైనంత త్వరలో కోడుమూరు, నందికొట్కూరు ఇంఛార్జులను మార్చాలని స్థానిక నేతలు కోరుతున్నారు.