దేశంలో జరుగుతోన్న ఎన్నికల్లో మోసాలు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తోంది. తాజాగా ఈ విషయంలో కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేసారు. బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో భారీ ఓట్ల దొంగతనం జరిగిందని లోక్సభలో ఆరోపణలు చేసారు. మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లోని 6.5 లక్షల ఓట్లలో, లక్షకు పైగా ఓట్ల చోరీ జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో లక్షకు పైగా నకిలీ ఓటర్లు, చెల్లని చిరునామాలు, బల్క్ ఓటర్లు ఉన్నట్లు కాంగ్రెస్ అంతర్గత పరిశోధనలో తేలిందన్నారు.
Also Read : నేను రెడీగా ఉన్నా.. మోడీ సంచలన కామెంట్స్
2024 లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్లో గట్టి పోటీ నెలకొందని, కౌంటింగ్లో ఎక్కువ భాగం కాంగ్రెస్ అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్ ఆధిక్యంలో ఉండగా, తుది ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ 32,707 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కు 6,26,208 ఓట్లు రాగా, బిజెపికి 6,58,915 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఏడు సెగ్మెంట్లలో ఆరు గెలిచినప్పటికీ, మహదేవపుర సెగ్మెంట్లో 1,14,000 ఓట్ల తేడాతో ఓడిపోయిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
1,00,250 ఓట్ల దొంగతనం జరిగిందన్నారు. 11,965 మంది నకిలీ ఓటర్లు, 40,009 మంది నకిలీ, చెల్లని చిరునామాలు ఓటర్లు, 10,452 మంది బల్క్ ఓటర్లు లేదా సింగిల్-అడ్రస్ ఓటర్లు, 4,132 మంది చెల్లని ఫోటోలు కలిగిన ఓటర్లు ఉన్నారని రాహుల్ వెల్లడించారు. కొత్త, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారి కోసం 33,692 మంది ఫారం 6ను దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవ్వకపోవడంపై రాహుల్ అనుమానాలు వ్యక్తం చేసారు.
Also Read : అవినాష్ వల్లే.. ఈ రచ్చ..!
అలా ఇస్తే ఎన్నికల సంఘం మోసం బయటపడుతోంది అన్నారు. తాము ఆరు నెలల పాటు విచారణ జరిపామని, అదే కాంగ్రెస్ ఎలక్ట్రానిక్ లిస్టు ఇస్తే, 30 సెకన్లలో నిజాలు బయటకు వస్తాయన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, బిజెపిని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఆ మెజారిటీని 240 సీట్లకు పరిమితం చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపి తన మిత్రపక్షాలపై ఆధారపడవలసి వచ్చింది. కాంగ్రెస్ 99 సీట్లతో రెండవ పెద్ద పార్టీగా నిలిచింది. ఇండియా కూటమికి 235 సీట్లు దక్కాయి. ఇక మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బిజెపి ఇదే తరహా మోసాలకు పాల్పడిందని రాహుల్ మండిపడ్డారు. ఫలితాల్లో వచ్చిన మార్పులు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుందన్నారు.