ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల మీద మాత్రమే దాడి చేసిన ఇరాన్.. ఇప్పుడు అమెరికా గడ్డపై కూడా దాడులకు దిగిందా..? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. టెక్సాస్ లోని పోర్ట్ ఆర్థర్ లో ఉన్న వాలెరో ఆయిల్ రిఫైనరీలో జరిగిన భారీ పేలుడు, అగ్నిప్రమాదం సంచలనంగా మారింది. అమెరికాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన టెక్సాస్ లోని వాలెరో రిఫైనరీ స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం భీకర పేలుడుతో దద్దరిల్లింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే భారీ ఎత్తున మంటలు, నల్లటి దట్టమైన పొగ వచ్చినట్లు అమెరికన్ మీడియా పేర్కొంది.
పోర్ట్ ఆర్థర్ నగరంలోని ఈ రిఫైనరీలో సోమవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దీని ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కూడా కంపించాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతానికి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, రిఫైనరీలోని ఒక ఇండస్ట్రియల్ హీటర్ వల్ల ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, రిఫైనరీ కార్మికులందరూ సురక్షితంగా ఉన్నట్లు వాలెరో యాజమాన్యం ధృవీకరించింది.
ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తుండటంతో, ఈ పేలుడు వెనుక ఏవైనా విదేశీ శక్తుల కుట్ర ఉందా అనే కోణంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇటీవలే ఇరాన్ విదేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసిన నేపథ్యంలో, ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అమెరికా అధికారులు మాత్రం ఇది కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమేనని, దీనికి యుద్ధంతో సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. రోజుకు దాదాపు 4,35,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ లో ఉత్పత్తి నిలిచిపోతే, అమెరికాలో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, ఈ ప్రమాదం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

