ఎన్నికల్లో గెలిచామని సంతోషించాలో.. లేక మళ్లీ అదే పెత్తనం కొనసాగుతోందని బాధపడాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్కు ఏ మాత్రం అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీకి కంట్లో రాయిలా తయారైన వైసీపీ నేతల్లో కొడాలి నాని ఒకరు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పైన, మంత్రి లోకేష్ పైన ఒంటికాలితో లేచారు. రాయలేని మాటలతో రెచ్చిపోయారు. గుడివాడలో తనకు తిరుగే లేదని కాలర్ ఎగురవేశారు. దమ్ముంటే గుడివాడలో గెలిచి చూపించండి అని సవాల్ కూడా చేశారు కొడాలి నాని.
Also Read : బాబు పై నా అభిప్రాయం ఏంటంటే..!
గుడివాడ నియోజకవర్గంలో 2004 నుంచి వరుసగా 5 సార్లు జరిగిన ఎన్నికల్లో నాని ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు టీడీపీ తరఫున, 3 సార్లు వైసీపీ తరఫున పోటీ చేసిన విజయం సాధించారు. జగన్కు నమ్మినబంటుగా గుర్తింపు తెచ్చుకున్న కొడాలి నాని వైసీపీ తొలి క్యాబినెట్లోనే మంత్రి పదవి దక్కించుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు గడ్డం గ్యాంగ్ పేరుతో అరాచకాలు జరిగాయనేది టీడీపీ నేతల ఆరోపణ. వీరిలో ముఖ్యంగా నాని ప్రధాన అనుచరుడు తులసి బాబు చేసిన దందాల గురించి అయితే కథలు కథలుగా చెప్పుకుంటారు.
Also Read : జోగి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ సమయంలో ఆయన గుండెలపై కూర్చుని హత్యాయత్నం చేశారనేది తులసిబాబుపై ప్రధాన ఆరోపణ. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్కు అత్యంత ఆప్తుల్లో ఒకరిగా తులసిబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే తులసిబాబుకు ఏపీ పోలీస్ శాఖలో మంచి పలుకుబడి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో తులసిబాబు పోలీస్ శాఖలో చక్రం తిప్పారు కూడా. అయితే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తులసిబాబు.. సరిగ్గా ఎన్నికల ముందు గుడివాడలో మార్పు ఖాయమని గ్రహించి.. సైలెంట్గా టీడీపీలో చేరిపోయారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముకు అత్యంత ఆప్తులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read : 30 ఏళ్ళకే గుండెపోటు ఎందుకొస్తుంది?
తులసిబాబు అరెస్టు అయినప్పుడు రాము స్వయంగా కోర్టు ప్రాంగణంలో అతనితో చర్చించారు కూడా. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం కూడా రేగింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు.. తులసిబాబుతో టీడీపీకి ఎలాంటి సంబంధాలు లేవన్నారు. కానీ తాజాగా తులసిబాబు పుట్టిన రోజు వేడుకలను గుడివాడలో గ్రాండ్గా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలోనే కేట్ కటింగ్ చేశారు. ఊరంతా ఫ్లెక్సీలు కూడా వేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. కొడాలి నానిని ఓడించిన ఆనందం లేదంటున్నారు. గుడివాడలో తులసిబాబు పెత్తనం పెరిగిపోయిందని.. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారంపై అధినేతకు ఫిర్యాదు చేసేందుకు గుడివాడ తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు.