వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు ఎందుకు పడింది.. అసలు దువ్వాడ చేసిన తప్పేంటి.. జగన్ను దైవంలా ఆరాధించే వారిలో దువ్వాడ కూడా ఒకరు కదా.. మరి అలాంటి దువ్వాడను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు.. దువ్వాడపై క్రమశిక్షణ సంఘం ఎందుకు చర్యలు తీసుకుంది.. ఇప్పుడు ఇవే ఏపీ పాలిట్రిక్స్లో హాట్ టాపిక్. నిజమే.. దువ్వాడ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు ఎందుకు పడిందో వాస్తవానికి వైసీపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. ఈ విషయంపై వైసీపీ అగ్రనేతలు సైతం మాకేం తెలియదు.. అంతా జగన్మాయ.. ఆయన చెప్పింది వేదం.. చేసింది చట్టం.. అంతే అంటున్నారు. అంతే తప్ప.. పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేశారంటే మాత్రం.. ఏమో.. ప్యాలెస్ పెద్దలకే తెలియాలి.. అంటూ సైలెంట్గా సైడ్ అయిపోతున్నారు. నిజానికి దువ్వాడ పై సస్పెన్షన్ వేటు అంటూ పార్టీ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియదు.
Also Read : సాయి రెడ్డే కీలకమా..? కసిరెడ్డి రిమాండ్ లో సంచలనాలు..!
2008లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన దువ్వాడ.. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజులకే టీడీపీ జెండా కప్పుకున్నారు. కానీ నెల రోజులకే సైలెంట్గా వైసీపీలో చేరిపోయారు దువ్వాడ శ్రీనివాస్. నాటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తానే వీర విధేయుడు అన్నట్లుగా వ్యవహరించారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో కింజరాపు కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 2014 ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసి ఓడారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి మరోసారి ఓడారు. ముచ్చటగా మూడోసారి 2024లో కూడా టెక్కలి నుంచి వైసీపీ టికెట్పై పోటీ చేసి ఓడారు. అయితే 2020 ఎన్నికల్లో కింజరాపు ఫ్యామిలి స్వగ్రామం నిమ్మాడలో జీపు మీద కూర్చుని అచ్చెన్నాయుడుకు సవాల్ చేసిన దువ్వాడ.. కత్తులతో బెదిరించడమే కాకుండా.. నానా దుర్భాషలతో రెచ్చిపోయాడు. దీంతో దువ్వాడ తీరును ప్రశంసించిన జగన్.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నాటి నుంచి జగన్ నా దేవుడు అంటూ పాదపూజ కూడా చేశారు దువ్వాడ.
Also Read : రజనీకి స్టార్ట్ అయింది.. మరిది తర్వాత ఎవరు..?
2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత దువ్వాడ పరువు పోయింది. కుటుంబ తగాదాలు, మరో మహిళతో సహజీవనం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఒకదశలో సోషల్ మీడియాలో దువ్వాడ – దివ్వెల హాట్ కపుల్ ఫుల్ ట్రెండింగ్. దివ్వెల మాధురి అనే మహిళను తిరుమల తీసుకెళ్లారు దువ్వాడ. తిరుమల కొండపైన ప్రధాన ఆలయం ఎదురుగానే మాధురి రీల్స్ చేయడం పెద్ద దుమారం రేపింది. తాజాగా వీరిద్దరు కలిసి ఓ వస్త్ర వ్యాపారం కూడా ప్రారంభించారు. అయితే వీరిద్దరు కలిసి పలు న్యూస్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిల్లో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు ఉన్నాయి. ఏపీలో బెస్ట్ పొలిటిషియన్ ఎవరు అంటే.. నారా లోకేష్ అంటూ దువ్వాడ – దివ్వెల జంట వెల్లడించింది. వెరీ నాలెడ్జ్ పర్సన్ అంటూ దువ్వాడ – దివ్వెల జంట చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో తన శత్రువునే పొగిడిన వ్యక్తి పార్టీలో ఉండకూడదు అని భావించిన జగన్.. ముందు దువ్వాడపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. దువ్వాడ – దివ్వెల విషయం బయటకు వచ్చిన తొలి నాళ్లలో సైలెంట్గా ఉన్న వైసీపీ అగ్రనేతలు.. 9 నెలల తర్వాత ఆ అంశంపై చర్యలు తీసుకుంటారా అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థిని తిడితే చాలు.. అన్న ఆనందిస్తారు.. అదే పొడిగితే.. అన్న ఆగ్రహానికి ఎవరైనా బలి అవ్వాల్సిందే అంటూ దువ్వాడను ఉదాహరణగా చూపిస్తున్నారు వైసీపీ నేతలు.