అధికార కాంగ్రెస్ పార్టీలో అన్ని ఆగిపోయాయా? పార్టీ పవర్లోకి వచ్చి సంవత్సరం దాటినా తమకి పదవులు రావడం లేదని నేతలు అసంతృప్తితో ఉన్నారా? క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పార్టీ కార్యవర్గం ఇలా అన్ని వాయిదా పడడంతో కాంగ్రెస్ నేతలు నిరుత్సాహంగా ఉన్నారా? ఇంతకీ పదవుల భర్తీ ఆలస్యానికి కారణమేంటి? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వినిపిస్తున్న ప్రశ్నలు.
తెలంగాణలోని చాలామంది కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా తమ కష్టానికి గుర్తింపు రావడం లేదని సతమతమవుతున్నారు. క్యాబినెట్లో ఆరు బెర్తులు ఖాళీ ఉండడంతో.. మంత్రి పదవి ఆశిస్తున్న పలువురు వాటిని ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో పార్టీ పెద్దలతో పలుమార్లు చర్చించినా ఒక కొలిక్కి రావడం లేదు. ఉమ్మడి జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని క్యాబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావించారు. కానీ ఆశావహులు ఎక్కువగా ఉండటం సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో క్యాబినెట్ విస్తరణ అర్థాంతరంగా ఆగిపోయింది.
Also Read : ఏసీబీ కంటే ముందే.. కేటిఆర్ కు ఈడీ షాక్
ఇక మంత్రి పదవుల విషయంలో ముఖ్య నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతోనే క్యాబినెట్ విస్తరణ ఆగిపోయినట్లు తెలుస్తోంది. తమ వారికే పదవులు ఇప్పించుకోవాలని ఒకరిద్దరు నేతలు పట్టుబట్టడంతోనే హై కమాండ్ సైతం ఏం చేయలేకపోతోందని సమాచారం. తెలంగాణ నేతలు కూర్చొని మంత్రివర్గ విస్తరణపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు స్పష్టం చేశారట. దీంతో మంత్రివర్గ విస్తరణతో పాటే.. భర్తీ చేయాలనుకున్న డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టులు కూడా ఆగిపోయాయి. పార్టీ అధికారంలోకి వస్తే తమకి పదవులు వస్తాయని ద్వితీయ శ్రేణి నేతలు ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పోస్టులు వస్తాయని భావించిన నేతలకు భంగపాటు తప్పడం లేదు.
తమ పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని భావించిన హస్తం పెద్దలు.. మొదటి విడతలో 38 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. మధ్యలో ఒకటి రెండు పోస్టులను కూడా భర్తీ చేశారు. ఇదంతా జరిగి దాదాపు ఆరు నెలల కాలం పూర్తయింది. ఇంకా ప్రభుత్వంలో 30కి పైగా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తామని నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా నామినేటెడ్ పోస్టుల అంశం కొలిక్కి రావపోవడం నేతల్లో అసహనానికి దారి తీస్తోంది. అధికారం ఉన్నప్పుడు కూడా తమని పట్టించుకోకపొతే తమ పరిస్థితి ఏంటని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఏపీ బియ్యం దొంగలపై కొత్త సిట్.. జాగ్రత్త పడ్డ సర్కార్…!
మంత్రిమండలి విస్తరణ, నామినేటెడ్ పోస్టుల అంశాన్ని పక్కన పెడితే పార్టీ పరంగా నియమించాల్సిన పోస్టుల్లో కూడా జాప్యం పెరుగుతూ వస్తోంది. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు పూర్తయింది. అయినా ఇప్పటి వరకు పార్టీ కార్యవర్గాన్ని కూడా భర్తీ చేయలేదు. దీంతో పార్టీ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలకు కూడా నిరాశ తప్పడం లేదు. పార్టీ కార్యవర్గం విషయంలో సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పి నెలలు గడిచినా.. అది మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.
దీంతో పార్టీ కార్యవర్గం భర్తీ చేయడంలో పార్టీ పెద్దలకు ఎందుకు ఇబ్బంది అవుతుందో అంటూ తమకు దగ్గరగా ఉండే నేతల దగ్గర తమ గోడు వెళ్లబోసుకుంటున్నట్లు సమాచారం. దీంతో లోకల్ బాడీ ఎన్నికల లోపైనా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని హస్తం పెద్దలు భావిస్తున్నారు. పదవులు భర్తీ చేస్తే ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతారని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు. పదవులు రాని వారికి రానున్న రోజుల్లో ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇస్తూ.. వీలైనంత త్వరగా అన్ని పదవులు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక పదవుల భర్తీకి శుభం కార్డు ఎప్పుడు పడుతుందో చూడాలి.