గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.. ప్రముఖ సామాజిక సేవా సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది కాలంగా నిలిచిపోయిన విదేశీ నిధుల నియంత్రణ చట్టం అనుమతులను కేంద్ర హోంశాఖ పునరుద్ధరించింది. దీంతో ఆర్డీటీ మళ్లీ విదేశీ విరాళాలను పొందేందుకు మార్గం సుగమమైంది. అనంతపురం జిల్లా కేంద్రంగా ఐదు దశాబ్దాలుగా విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన ఆర్డీటీ సంస్థ విద్య, వైద్యం, క్రీడలు, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశేష సేవలు అందిస్తోంది.
Also Read : మతం మారితే రిజర్వేషన్ రద్దు..!
అయితే, ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా మత మార్పిడిలకు పాల్పడుతోందంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టి, 2025 ఏప్రిల్ లో కేంద్ర హోంశాఖ, గత ఏడాది ఆర్డీటీ యొక్క ఎఫ్ సిఆర్ ఏ లైసెన్స్ ను నిలిపివేసింది. విదేశీ నిధులు నిలిచిపోవడంతో ఆర్డీటీ నిర్వహిస్తున్న బత్తలపల్లి, కణేకల్లు ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారింది. వేలాది మందికి అందుతున్న ఉచిత వైద్యం, విద్యార్థుల విదేశీ విద్య, క్రీడాకారుల శిక్షణపై ఈ ప్రభావం పడింది. సుమారు 3,500 గ్రామాల్లోని లక్షలాది మంది లబ్ధిదారులు ఈ నిర్ణయంతో ఆందోళనకు గురయ్యారు.
ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఏపీ సర్కార్, సిఎం చంద్రబాబు నేరుగా కేంద్రంతో చర్చలు జరిపారు. ఆర్డీటీ సంస్థపై వచ్చిన ఆరోపణలపై క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం.. సంస్థ ఎలాంటి మత మార్పిడిలకు పాల్పడలేదని, కేవలం సామాజిక సేవకే పరిమితమైందని కేంద్రానికి నివేదికలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్డీటీ సేవా దృక్పథాన్ని గుర్తించి అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నిర్ణయంతో ఆర్డీటీ యాజమాన్యం, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!
దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. ఆర్ డీ టీ సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ట్రస్టు సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చానని.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలందించే సంస్థ కృషిని కేంద్రానికి వివరించాను అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంతో అడ్డంకులు తొలగిపోయాయన్నారు. అటు సిఎం చంద్రబాబు కూడా దీనిపై స్పందించారు. విదేశీ నిధుల సమస్యను పరిష్కరించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ధన్యవాదాలు తెలిపారు. కాగా 1969లో స్పానిష్ జాతీయుడు విన్సెంట్ ఫెర్రర్ ఈ సంస్థను ఏర్పాటు చేసారు.

