కాంగ్రెస్ పార్టీతో విభేధించి బయటికి వచ్చిన జగన్ అప్పట్లో ఓదార్పు యాత్ర చేపట్టారు. ఐతే యాత్ర మధ్యలో ఉండగానే అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలు పాలయ్యారు. అన్న జైలుకి వెళ్ళడంతో రాష్ట్రంలో వైసిపి అభిమానుల కోసం జగనన్న వదిలిన బాణాన్ని నేను వున్నాను అంటూ పాదయాత్ర మొదలు పెట్టి బైబై బాబు అంటూ అన్న కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగింది షర్మిల. ఐతే ఉన్నట్లుండి ఏమైందో తెలియదు గానీ ఏపి రాజకీయాలతో పాటు అన్న వైఎస్ జగన్ కు దూరంగా జరిగి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు ఆమె.
తెలంగాణాలో రైతు భరోసా యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ నిత్యం ప్రజలలో ఉంటున్నారు. ఐతే తెలంగాణలో షర్మిళ పార్టీకి ఊహించినంత రెస్పాన్స్ రాలేదనే చెప్పుకోవాలి. దీంతో షర్మిళ కొంత నిరుత్సాహపడుతున్నారనే ప్రచారమూ లేకపోలేదు. దీంతో షర్మిళ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారని, దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అంతటితో ఆగకుండా వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జులై 8న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇడుపులపాయ లోని వైఎస్ ఆర్ ఘాట్ ని సందర్శించనున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఐతే షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక వైఎస్ఆర్ ఆత్మబంధువు కేవిపి రామచందర్రావు చక్రం తిప్పారనే ప్రచారం లేకపోలేదు. ఇప్పటికే వైఎస్ షర్మిళ కు.. తన అన్నా వదినలతో ఆస్థి తగాదాలు, కుటుంబ వివాదాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. పైగా తెలంగాణలో తన పార్టీకి కానీ, తన పాదయాత్రకు కానీ, సాక్షి మీడియాలో కనీసం కవరేజ్ కూడా ఇవ్వడం లేదని పలుమార్లు ఆమె తన ఆక్రోశాన్ని బహిరంగంగానే వ్రెళ్ళగ్రక్కారు.
అన్నపై బాణం ప్రయోగిస్తే..
ఇటువంటి పరిస్థితులలో వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమె కేవలం తెలంగాణకి మాత్రమే పరిమితం అవుతారని అనుకోలేము. రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ జగన్ వదిలిన అదే బాణాన్ని జగన్ మీదుకే ప్రయోగిస్తే మాత్రం జగన్ కి కొంత మేర ఇబ్బందులు తప్పవు అనేది రాజకీయ విశ్లేషకుల వాదన.