ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఒక మంత్రి పదవిపై పెద్ద చర్చే జరుగుతుంది. చంద్రబాబు తన మంత్రి వర్గంలో ఒక మంత్రి పదవిని ఎవరికి ఖరారు చేయకుండా అలా ఉంచడంతో అసలు ఎవరికి ఆ శాఖ కేటాయిస్తారు అనే విషయం పై ఎలాంటి స్పష్టత రావడం లేదు. దీనిపై జనసేన, బిజెపి నేతలు కూడా ఆసక్తిగానే ఉన్నారు. అయితే ఆ మంత్రి పదవి టీడీపీలో ఒక సీనియర్ నేతకు ఖరారు చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. కాదు బిజెపిలో ఒక ఎమ్మెల్యే గారు ఆ మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారని ఎన్నికలకు ముందే చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారని అంటున్నారు.
ఆ పదవి టిడిపి నాయకుడికి ఇచ్చే అవకాశం ఉంటే గోరంట్ల బుచ్చయ్య లేదంటే… రఘురామ కృష్ణం రాజు కూడా రేసులో ఉన్నారని సమాచారం వస్తుంది. ఈ మంత్రి పదవి కోసం రఘురామ అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆయన ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతారు అనేది అర్ధం కాని పరిస్థితి. అందుకే ఆ పదవి ఆయనకు కేటాయించకుండా అలా ఉంచారని టీడీపీ వర్గాలే అంటున్నాయి. ఇక బిజెపి నుంచి సుజనా చౌదరి మంత్రి పదవి మీద ఆశ పడుతున్నారని అంటున్నారు. మంత్రివర్గంలో ఆయనకు స్థానం దొరుకుతుందని ఫలితాలు వెల్లడైన రోజు నుంచే ఊహాగానాలు వచ్చాయి. అయితే బిజెపిలోని అంతర్గత పోరు ఆయనకు పదవి రాకుండా చేసిందని తెలుస్తుంది. సుజనా కు పదవి పై చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారని బిజెపి వర్గాలు అంటున్నాయి.
దసరా తర్వాతనే దానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. అయితే సుజనా ఇప్పటికే కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అయితే బిజెపి అధిష్టానం అనుమతి లేకుండా బాబు ఆయనకు పదవి ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఆ మంత్రి పదవిని గోరంట్లకు ఇస్తే మంచిది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గోరంట్ల పోటీ చేసే అవకాశం దాదాపుగా లేదనే మాట కూడా వినపడుతుంది. అందుకే ఆయనకు ఖరారు చేయాలని కోరుతున్నారు. ఇక దేవినేని ఉమా పేరు కూడా పరిశీలనలోనే ఉందని సమాచారం. మరి చంద్రబాబు మనసులో ఏముందో తెలియాలన్నా, ఆ పదవి ఎవరికీ దక్కుతుందో చూడాలన్నా కొంత కాలం ఆగక తప్పదు.