పార్టీని కాపాడుకునే బాధ్యత నాయకుడిది మాత్రమే కాదు… నేతలు, కార్యకర్తలది కూడా… పార్టీ అధికారంలోకి రావాలంటే… నాయకుడు ఒక్కడే కాదు… నేతలు కూడా పని చేయాలి… మరోసారి ఎన్నికల్లో గెలవాలంటే… చేసిన మంచి పనిని ప్రచారం చేసుకోవాల్సిందే… మా నాయకుడు చూసుకుంటాడు లే అని నిర్లక్ష్యం వహిస్తే… ఏం చేయలేను… ఈ వ్యాఖ్యలు చేసింది సాక్ష్యాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాభవన్ వేదికగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు మీరు పని చేస్తున్నారా.. లేదా..? అని నేతలను నిలదీశారు. ఇదే తరహాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో గెలవటం చాలా కష్టమన్నారు కూడా.
Also Read: పవన్ కు వెయిట్ ఇవ్వడం వెనుక రీజన్ అదేనా…?
తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వేపై వస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయన్నారు. గతంలో తెలంగాణలో ఇదే తరహాలో ఇంటింటి సర్వే నిర్వహించినప్పటికీ.. అందులో పూర్తిస్థాయిలో వివరాలు లేవన్నారు. అందుకే తమ ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించిందన్నారు. ఇందులో ఏ కులానికి ఎంత జనాభా ఉందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇదే తరహాలో గతంలో గుజరాత్లో నిర్వహించారని రేవంత్ గుర్తు చేశారు. గుజరాత్లో ముస్లీంలోని కొన్ని వర్గాలను బీసీలుగా గుర్తించారన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రచారం చేసుకోలేకపోయామని 2022లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా రేవంత్ గుర్తు చేశారు.
Also Read: గెలవాలంటే… మళ్లీ పాత పాటే తప్పదా..?
కులగణన అనేది చారిత్రాత్మక అంశమన్నారు. “నా వంతు పని పూర్తి చేశాను.. ఇక దానిని ప్రజలకు వివరించి… ప్రతిపక్షాల విమర్శలను అడ్డుకోవాల్సిన బాధ్యత మీదే”… అంటూ ప్రజాప్రతినిధులు, నేతలకు సూచించారు. కులగణన అనేది చిన్న విషయం కాదన్నారు. ఏ కులానికి చెందిన నేత… ఆయా కుల సంఘాలతో సమావేశం నిర్వహించాలని సూచించారు. మార్చి 18వ తేదీ లోపు ఈ సమావేశాలు పూర్తి చేయాలన్నారు. ఆ సమావేశాల్లో ఆయా కులాలకు సంబంధించిన జనాభా వివరాలపైన, సమస్యలపైన, అవసరాలపైన చర్చించాలని సూచించారు. కులాలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు, సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ సూచనతోనే కులగణన సర్వే నిర్వహించామన్నారు. ఈ సర్వే పూర్తయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. త్వరలోనే రెండో విడత సర్వే కూడా జరుగుతుందని.. ఎవరైనా వివరాలు నమోదు చేసుకోలేని వారు… రెండో విడతలో చేసుకోవాలని సూచించారు. తన హయాంలో ఏం జరిగిందని ఎవరైనా అడిగితే… కులగణన అని గర్వంగా చెబుతా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.




