మాజీ మంత్రి కొడాలి నానికి ఏమైంది.. హడావుడిగా హైదరాబాద్ ఆసుపత్రి నుంచి ముంబై ఎందుకు తరలించారు. అసలు నాని ఆరోగ్యంగా ఉన్నారా.. నిన్నటి వరకు ఏం కాలేదని చెప్పిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎందుకు ఆందోళన చెందుతున్నారు.. ఇవే ఇప్పుడు హాట్ టాపిక్. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా ఉన్న సమయంలో రోజూ వార్తల్లో నిలిచారు కొడాలి నాని. ఇంకా చెప్పాలంటే… నాటి ప్రతిపక్షాలు ఏ చిన్న కార్యక్రమం చేసినా.. ఏ చిన్న కామెంట్ చేసినా సరే.. దానిపై నాని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ పైన, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పైన కూడా విచక్షణా రహితంగా కామెంట్లు చేశారు. నోటీకి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. దీంతో నాని బాగా ఫేమస్ అయ్యారు.
Also Read : ఎమ్మెల్సీ దువ్వాడ.. డాక్టరేట్లో నిజమెంత?
వారం రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో కొడాలి నాని హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ముందు గ్యాస్ ట్రబుల్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు వైసీపీ నేతలు చెప్పారు. అయితే వైద్యులు మాత్రం నానిని పరిశీలించిన తర్వాతే.. ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నట్లు గుర్తించారు. నానికి చిన్నపాటి సర్జరీ చేస్తే సరిపోతుందని ముందు భావించారు. కానీ ఆ తర్వాతే అసలు విషయం తెలిసింది. నాని గుండెలో మూడు వాల్వులు పూర్తిగా చెడిపోయినట్లు ఏఐజీ వైద్యులు గుర్తించారు. తక్షణమే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. ఇందుకోసం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఆఘమేఘాల మీద ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. హైదరాబాద్లో అందుబాటులో లేకపోవడంతో.. ముంబై నుంచి పిలిపించారు.
Also Read : వర్మ కోసం వైసీపీ మైండ్ గేమ్..!
ప్రాథమిక వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత కొడాలి నానికి ఓపెన్ హార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అత్యాధునిక వసతులున్న ఏఐజీలో కాకుండా ప్రత్యేక విమానంలో ముంబై తరలించి… అక్కడ బ్రీచ్ క్యాండీలో ఎందుకు ఆపరేషన్ చేయిస్తున్నారనేది ఇప్పుడు మిస్టరీగా ఉంది. నానితో పాటు కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వర్రావు, ఎన్ఎస్ రెడ్డి, శివకుమార్, ప్రియాంక ఫెర్నాడెజ్, ఆకాంక్ష చోప్రా, కోనేరు రాజ్యలక్ష్మి కూడా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన విమానంలో ఉన్నారు.