నడక అనేది మన జీవితంలో అత్యంత కీలకం. ఈ రోజుల్లో చాలా మంది శరీరాలను కష్టపెట్టడం ఇష్టం లేక ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. బద్ధకంతో అనవసరమైన ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చుకుంటున్నారు. వైద్యులు ఎన్ని విధాలుగా హెచ్చరించినా కనీసం వాకింగ్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే నడక అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదని ఎన్నో ప్రయోజనాలకు వేదికగా మారుతుందని తెలిపారు పరిశోధకులు. ప్రతి రోజు క్రమం తప్పకుండా నడవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
అంతే కాకుండా తాజాగా నిర్వహించిన మరో స్టడీలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. మన నడకలో కాస్తంత వేగాన్ని పెంచడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని జపాన్లోని దోషిషా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. స్థూల కాయంతో బాధపడుతున్న 25 వేలమందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధ్యయన వివరాలు ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్లో ప్రచురించారు.
Also Read : బన్నీ ఎఫెక్ట్.. టాలీవుడ్లో కొత్త భయం..!
వేగంగా నడిచే వారిలో డయాబెటిస్ ముప్పు 30 శాతం తక్కువగా ఉందని గుర్తించారు. హైపర్ టెన్షన్, రక్తంలో అసాధారణ లైపోప్రొటీన్ లెవల్స్ (డిస్లీపిడీమియా) ముప్పు కూడా చాలా తక్కువని స్పష్టంగా అర్ధమైంది. నడక వేగానికి, సమగ్ర ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. వేగంగా నడిచే వారిలో గుండె, ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉందని వెల్లడి అయింది. ఇది మెరుగ్గా ఉంటే జీవక్రియకు సంబంధించిన వ్యాధుల ముప్పు దూరంగా ఉంటుందని తేల్చారు. నడవడాన్ని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు.




