ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. చిన్న గీత పక్కన పెద్ద గీత ఉంటే.. అప్పుడు అందరి దృష్టి పెద్ద గీత వైపే ఉంటుంది కదా అనేది ఇందులో లాజిక్. ఇదే సూత్రాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు అనుసరిస్తున్నారు. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై తేదీ కూడా ప్రకటించారు. దీంతో కూటమి సర్కార్ను ప్రశ్నించేందుకు, ప్రభుత్వ పనితీరును తప్పుబట్టేందుకు వైసీపీ నేతల దగ్గర ఏ కారణాలు లేవు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పెరుగుతుందనే ఆందోళనతో వైసీపీ నేతలు కొత్త డ్రామాలకు తెర లేపారనే మాట వినిపిస్తోంది.
Also Read : అణు యుద్దమేనా..? వెనక్కు తగ్గని ఇరాన్
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా గత ప్రభుత్వంలో జరిగిన వ్యవస్థల దోపిడీపై చంద్రబాబు దృష్టి పెట్టారు. మద్యం కుంభకోణంలో వేల కోట్లు దోపిడీ జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం.. దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం.. సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు ప్రముఖులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. త్వరలోనే మరిన్ని అరెస్టులు తప్పవనే మాట కూడా వినిపిస్తోంది. ఇదే సమయంలో పరిపాలనపై కూడా కూటమి సర్కార్ పట్టుసాధిస్తోంది. పట్టాలు తప్పిన వ్యవస్థలను గాడిలో పెడుతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పరుస్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. దీంతో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు బయటపడతాయేమో అనే భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : పాకిస్తాన్ కు బాగా తెలుసు.. ట్రంప్ సంచలన కామెంట్స్
పథకాల అమలుతో పాటు ఏపీ బ్రాండ్ పెంచేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ ఏడాది విశాఖలో జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీనికి యోగాంధ్ర అనే బ్రాండ్తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు కూడా. దీని వల్ల ఏపీతో పాటు విశాఖ పేరు కూడా మార్కెట్లో వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. వైసీపీ అధికారంలో 3 రాజధానుల పేరుతో విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ ప్రకటించారు. అప్పుడు అంతా ఆహో ఓహో అన్నారు. కానీ క్యాపిటల్ ముసుగులో విశాఖలో విలువైన భూములను వైసీపీ నేతలు కబ్జాలు చేశారనే ఆరోపణలున్నాయి. కానీ చంద్రబాబు సర్కార్లో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపుతో పాటు పెట్టుబడులు కూడా వస్తున్నాయి. దీంతో తమకు మరింత చెడ్డపేరు వస్తుందనే భయం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.
విశాఖలో యోగాంధ్ర మెగా ఈవెంట్కు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే వైఎస్ జగన్ పరామర్శల పేరుతో కొత్త రాజకీయం చేస్తున్నారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. టాపిక్ డైవర్షన్లో భాగంగానే పొదిలి, సత్తెనపల్లిలో జగన్ పర్యటించారని.. పరామర్శల పేరుతో బలప్రదర్శన చేపట్టారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏడాది క్రితం బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా జగన్ పల్నాడు పర్యటన ముందు రోజే చెవిరెడ్డి బెంగళూరు నుంచి కొలంబో ఎందుకు పారిపోతున్నారో కూడా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : రప్ప రప్ప ఎవరిని నరుకుతావ్ జగన్..? పయ్యావుల అదిరిపోయే కౌంటర్
వాస్తవానికి చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసి దాదాపు 2 నెలలు దాటింది. ఎఫ్ఐఆర్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరున్నా కూడా.. ఇప్పటి వరకు అధికారులు విచారించలేదు. అయితే పొదిలిలో జగన్ పర్యటన సమయంలో పోలీసులపైన, మహిళలపైన రాళ్లు విసిరిన కేసులో ఇప్పటికే 10 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారితో మాట్లాడాలి అంటూ రాత్రి 9 గంటల తర్వాత స్టేషన్కు వచ్చిన చెవిరెడ్డి.. అక్కడి సీఐపై దాడికి యత్నించారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు చెవిరెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ఇక తల్లికి వందనం సక్సెస్, యోగాంధ్ర మెగా ఈవెంట్ నిర్వహణతో కూటమి సర్కార్కు పేరు వస్తోంది కూడా. ఈ రెండు టాపిక్లు డైవర్ట్ చేయడానికే పోలీసులు వద్దనా కూడా జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించారని.. అదే సమయంలో లుకౌట్ నోటీసులున్నా కూడా చెవిరెడ్డి కొలంబో వెళ్లేందుకు యత్నించారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గన్మెన్ మదన్ రెడ్డి డీజీపీకి లేఖ రాసిన 24 గంటల్లోనే చెవిరెడ్డి కొలంబో పారిపోవాలనుకోవటం వెనుక డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి సర్కార్కు చెడ్డ పేరు తీసుకువచ్చేందుకే జగన్ అండ్ కో టీమ్ కుట్రలు చేస్తోందంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పోలీసులపై అంబటి రాంబాబు వంటి నేతలు దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. వీరికి అరెస్టు చేస్తే.. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని గగ్గొలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.