రాజకీయమంటే పదవి, అధికారం, ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తు వేయడం.. కానీ ప్రస్తుత రాజకీయాలకు అర్థం పూర్తిగా మారిపోయిందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య, ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల నేతలు ఒక వేదిక మీద కాదు కదా.. అధికారిక కార్యక్రమంలో ఎదురుపడేందుకు కూడా ముందుకు రావడం లేదు. రిపబ్లికే డే, స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాజ్భవన్లో గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా ప్రతిపక్ష నేతలు దూరంగా ఉంటున్నారు. అక్కడికి వస్తే.. ముఖ్యమంత్రులకు మర్యాద ఇవ్వాలి, వాళ్లతో కలిసి కాసేపు మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఆ కార్యక్రమానికి రాకుండా.. కుంటిసాకులు చెబుతున్నరు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నాటి నుంచి ఒక్కసారే అసెంబ్లీకి వచ్చారు. అది కూడా ఇలా వచ్చి.. అలా వెళ్లారు. అంతే తప్ప.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించలేదు. ఇదంతా కేవలం ప్రత్యర్థి నేతలపై పగ మాత్రమే అనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట.
Also Read : వీరమల్లుకు లైన్ క్లియర్.. కండీషన్స్ ఇవే
ఏపీలో పగ, ప్రతీకారాలు ఎక్కువయ్యాయనే మాట బాగా వినిపిస్తోంది. అక్రమాస్తుల కేసులో తనను అకారణంగా ఇరికించారని.. దీని వెనుక చంద్రబాబు కూడా ఉన్నారనేది జగన్ భావన. తనపై తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైలులో ఉంచారనేది వైసీపీ అధినేత జగన్కు కోపం. అందుకే తాను అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై ఎన్నోసార్లు కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. విశాఖ ఎయిర్ పోర్టులో రాళ్ల దాడి, రేణిగుంట ఎయిర్ పోర్టులో అడ్డగింత, అమరావతి, యర్రగొండపాలెంలో రాళ్ల దాడి.. చివరికి ఎలాంటి ఆధారాలు లేకున్నా కూడా అవినీతి చేశారంటూ అక్రమంగా అరెస్టు చేసి 52 రోజులు పాటు జైల్లో పెట్టారు. అయితే ఇది చంద్రబాబుకు చాలా మేలు చేసింది కూడా. జగన్ తీరును తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీ ప్రజలు.. 11 స్థానాలకే పరిమితం చేశారు.
Also Read : వివేకా కేసు.. సెన్సేషనల్ క్రియేట్ చేయబోతుందా..?
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒకటే విషయం హాట్ టాపిక్గా నడుస్తోంది. అదే చంద్రబాబు పగ తీర్చుకున్నారనే మాట బాగా వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్లో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో మిథున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుల్లో పెద్దిరెడ్డి కుటుంబం ఒకటి. రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో పెద్దిరెడ్డి ప్రభావం బాగా ఉంటుంది. చిత్తూరు జిల్లాకు చెందిన నేత అయినప్పటికీ.. ఆ జిల్లాపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తన పట్టు నిలుపుకోలేక పోయారు చంద్రబాబు. చివరికి 2024 ఎన్నికల్లో సైతం.. హేమాహేమీలంతా ఓడినప్పటికీ.. పెద్దిరెడ్డి కుటుంబం నుంచి పోటీ చేసిన రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేలుగా, మిథున్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇది టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. అటవీ భూముల ఆక్రమణ, సబ్ కలెక్టర్ ఆఫీసులో దస్త్రాల దహనం, భూముల ఆక్రమణ వంటి కేసుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అంటూ పుకార్లు షికారు చేశాయి. కానీ కనీసం విచారణ కూడా జరగలేదు అనేది వాస్తవం. దీంతో పెద్దిరెడ్డి కుటుంబమంటే చంద్రబాబు వెనుకడుగు వేస్తున్నారని వైసీపీ నేతలతో, సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వెల్లువెత్తాయి.
Also Read : ఎవరి కొడుకైనా టాలెంట్ ఉండాల్సిందే.. పవన్ సంచలన కామెంట్స్
వాస్తవానికి 1978లోనే పెద్దిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. నాటి ఎన్నికల్లో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత 1985 లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి మళ్లీ ఓడారు. పీలేరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పెద్దిరెడ్డి. 2009-10 మధ్య కాలంలో రోశయ్య క్యాబినెట్లో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి.. జగన్కు అత్యంత సన్నిహితులయ్యారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు కంటే పెద్దిరెడ్డికే పవర్ ఎక్కువ అనే మాట వినిపిస్తోంది. యువగళం పాదయాత్ర ప్రారంభం నుంచి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కలిగించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్పై ఏకంగా 40కి పైగా కేసులు నమోదయ్యాయి. అంతటి పవర్ ఫుల్ లీడర్కు చెక్ పెట్టేందుకు ఇప్పుడు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగినట్లున్నారనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ఇంతకాలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న పెద్దిరెడ్డికి చంద్రబాబు బ్రేకులు వేశారనే మాట కూడా వినిపిస్తోంది. విద్యార్థి దశ నుంచే చంద్రబాబు, పెద్దిరెడ్డి మధ్య వైరం ఉంది. విద్యార్థి నేతగా పెద్దిరెడ్డిని కాదని చంద్రబాబును ఎన్నుకున్నారు. ఒకేసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు.. మంత్రి కూడా అయ్యారు. పెద్దిరెడ్డి ఓడిపోయారు. ఇది కూడా పెద్దిరెడ్డి అసహనానికి కారణమనేది సన్నిహితుల మాట. ఇక 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మాత్రమే గెలిచారు. దీంతో జిల్లాపై పెద్దిరెడ్డి పెత్తనం చెలాయించారు.
Also Read : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి మాటకు విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు జిల్లాలో ఏకచత్రాధిపతిగా వెలుగొందిన పెద్దిరెడ్డి.. ప్రస్తుతం బయటకు కూడా రావటం లేదు. వరుస కేసులు, ఆరోపణలతో పెద్దిరెడ్డి సతమతమవుతున్నారు. పార్లమెంట్లోనే సహచర ఎంపీని.. “రేయ్.. నువ్వు కూర్చోరా..” అంటూ నోరు పారేసుకున్న రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లు వ్యవహరించిన పెద్దిరెడ్డి కుటుంబం.. ప్రస్తుతం సైలెంట్గా ఉంది. వైఎస్ కుటుంబానికి అండగా నిలిచిన పెద్దిరెడ్డి.. తొలి నుంచి చంద్రబాబుపై ఒంటికాలిపై దూకారు. వైఎస్ కుటుంబం వెంట ఉన్న పెద్దిరెడ్డి కుటుంబం వరుస కేసులతో, జైలు జీవితం గడుపుతుంటే.. చంద్రబాబు వెంట నడిచిన నేతలు గవర్నర్, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రి వంటి ఉన్నత పదవుల్లో ఉంటున్నారనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల మాట.