ఏపీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటి వరకు వారానికి నాలుగు రోజులు మాత్రమే ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం సిఫార్సు లేఖల సంఖ్యను ఇకపై ఆరు రోజులకు పెంచనున్నట్లు వెల్లడించింది. వారంలో శనివారం మినహా మిగిలిన రోజుల్లో ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలపై ఆరుగురికి వీఐపీ బిగినింగ్ బ్రేక్ దర్శనం అవకాశం ఉంటుందని ఏపీ సర్కార్ తెలిపింది. అలాగే ఎమ్మెల్యే కోటాలో ప్రతిరోజు ఆరుగురికి సుపధం దర్శనం కూడా అవకాశం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
Also Read : వర్రా రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే విషయాలు
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం స్వామివారిని సుమారు 60 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి సంబంధించి సర్వ దర్శనం, రూ.300, వీఐపీ బ్రేక్ దర్శనం వంటివి ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. సర్వదర్శనం టొకెన్లను ఏ రోజుకారోజు ఇస్తారు. ఇక రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను అయితే ఏకంగా 3 నెలల ముందు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. అవి కూడా విడుదలైన గంట వ్యవధిలోనే అయిపోతున్నాయి.
దీంతో స్వామిని దర్శించుకునేందుకు స్థానిక ఎమ్మెల్యేలను సిఫార్స్ లేఖలివ్వాలని కోరుతున్నారు. అయితే వారంలో నాలుగు రోజులు మాత్రమే లేఖలను తిరుమల అధికారులు అనుమతిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఎలాంటి సిఫార్సు లేఖలను అనుమతించరు. దీని వల్ల కార్యకర్తల్లో కొంత అసహనం వ్యక్తం అవుతోందని ప్రజాప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే గతంలో అందుబాటులో ఉన్న సుపధం ఎంట్రీ టికెట్లను కూడా పునరుద్ధరించాలని కోరారు.
Also Read : టీడీపీ నేతలందరికీ చంద్రబాబు న్యాయం చేశారా..?
దీనిపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. సిఫార్సు లేఖల అనుమతి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. శనివారం రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ రోజు మినహా మిగిలిన రోజుల్లో సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు. అలాగే సుపధం ఎంట్రీ టికెట్లను తిరిగి జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు అంశాలపై ఈ నెల 18న జరగనున్న టీటీడీ పాలకమండలిలో సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారా లోకేశ్ సహచర ఎమ్మెల్యేలకు తెలిపారు.