ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఏపీలో పోలీసు శాఖలో ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా 10 మంది ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్కు బదిలీ చేయగా.. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా సుమిత్ సునీల్ నియమితులయ్యారు. అనంతపురం ఎస్పీగా జగదీష్, విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్గా మురళికృష్ణ, విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు, గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా, ఇంటలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఏఎస్సీగా పంకజ్కుమార్ మీనా, పార్వతీపురం ఎస్డీపీవోగా సురాన్ అంకిత్ నియమితులయ్యారు. వీరితో పాటు ఏపీలో సిఐలని కూడా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు వివాదాస్పద సిఐలను వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు ఇవ్వగా.. భారీగా డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పుడు మీడియా వర్గాల్లో పోలీసుల గురించి ఏ వార్త వచ్చినా ఇదే… ఐపిఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరిని బదిలీలు చేసేస్తుంది సర్కార్. నిన్న ఒక్క రోజే… 49 మంది అదనపు ఎస్పీలను నియమించి 12 మంది ఎస్పీలను బదిలీ చేసారు. మళ్ళీ సాయంత్రం 10 మందిని బదిలీ చేసారు. నిన్న ఎన్టీఆర్ జిల్లాలో ఏకంగా ఒక్క రోజే 100 మంది ఎస్సైలను బదిలీ చేసింది ప్రభుత్వం. దీనితో అసలు పోలీసు శాఖలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. ఎవరిని ఎప్పుడు బదిలీ చేస్తారో తెలియడం లేదు. మళ్ళీ ఈ రోజు ఉదయమే 12 మంది నాన్ కేడర్ ఎస్పీ లకు బదిలీ, పోస్టింగ్ లు ఇచ్చారు. 49 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు హోం సెక్రటరీ కుమార విశ్వజిత్.
అనంతపురం జిల్లా ఎస్పీని రెండు నెలల్లో నాలుగు సార్లు మార్చడం సంచలనం అయింది. నిన్న మళ్ళీ కొత్త ఎస్పీని నియమించారు. దీనితో పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. పోస్టింగ్ వచ్చిందని సంబరపడేలోపు మరో చోటకు బదిలీ అయిపోతున్నారు. దీని వెనుక ఉన్న ఉద్దేశం పోలీసు శాఖను ప్రక్షాళన చేయడమే అంటున్నారు పరిశీలకులు. వైసీపీ నేతలకు సహకరిస్తున్న పోలీసు అధికారులను… దూరంగా బదిలీలు చేసేస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరం పంపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ తో సంబంధం లేని బాధ్యతలు ఇస్తున్నారు. లాబియింగ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. వైసీపీతో అంటకాగిన ప్రతీ ఒక్కరికి ఇప్పుడు బదిలీల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. ఇంకా భారీగా బదిలీలు ఉండవచ్చని తెలుస్తోంది.