ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మరో కీలక హామీ అమలు ముహుర్తం సమీపిస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం. దీనిపై ఇప్పటికే తేదీ ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆర్టీసీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీని కోసం ప్రభుత్వం తరఫున ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లో ఏపీ మంత్రుల బృందం పర్యటించింది. దీనిపై విధివిధానాలను పరిశీలించారు. ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చారు. దీంతో మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రయాణించవచ్చని తేల్చి చెప్పారు.
Also Read : లిక్కర్ కేసులో సంచలనం.. 12 అట్టపెట్టెల్లో భారీగా డబ్బు
అయితే ఇక్కడే అసలు సమస్య ప్రజల్లో మొదలైంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తొలి నుంచి వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. మొదట్లో పథకం అమలు సాధ్యం కాదన్నారు. తర్వాత అసలు పథకం అమలవుతుందా అని విమర్శలు చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాధ్యమవుతుందా అని నిలదీశారు. మహిళలను మోసం చేశారన్నారు. జిల్లా పరిధిలోనే ప్రయాణమంట.. మరోసారి మహిళలను చంద్రబాబు మోసం చేశారంటూ తెగ గగ్గొలు పెట్టారు. అయితే వీటన్నిటికీ కూటమి సర్కార్ ధీటుగా జవాబిచ్చింది. దీనిపై విధివిధానాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎండీ ద్వారకా తిరుమల రావు అధికారులతో రివ్యూ నిర్వహించారు. బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే అంశంపై క్లారిటీ ఇచ్చారు. జిల్లా పరిధిలోనే ప్రయాణం అని.. అవి కొత్త జిల్లాలా.. లేక ఉమ్మడి జిల్లా పరిధిలోనా అనే ప్రశ్నలు కూడా జవాబిచ్చారు. ప్రయాణం చేసే సమయంలో ప్రయాణీకులు ఏ విధమైన ఐడీ కార్డులు చూపించాలనే విషయంపై కూడా వివరణ ఇచ్చారు ఎండీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏ ఐడీ కార్డు అయినా సరే.. చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఆధార్, పాన్, ఓటర్, రేషన్ కార్డుల్లో ఏదైనా పర్లేదన్నారు. అలాగే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని.. మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేయవచ్చన్నారు.
Also Read : అమెరికా, రష్యాలను వణికించిన భూకంపం.. రష్యాలో సునామీ భీభత్సం..!
పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు సిటీ సర్వీసులైన మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణాలు చేయవచ్చన్నారు ఎండీ ద్వారకా తిరుమల రావు. దీంతో విపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం బ్రేక్ వేసినట్లు అయ్యింది. టీడీపీ నేతలు తొలి నుంచి చెబుతున్నట్లుగానే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ వెల్లడించింది. చంద్రబాబు సింగపూర్ పర్యటన అనంతరం క్యాబినేట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎండీ అధికారిక ప్రకటనతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పరిధి, బస్సులు, ఐడీ కార్డులపై నెలకొన్న సందిగ్ధత వీడిపోయింది.