ఆంధ్రప్రదేశ్ లో వరుస ప్రమాదాలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. గత నాలుగు రోజుల్లో దాదాపు 5 చోట్ల పరిశ్రమలలో ప్రమాదాలు జరిగాయి. నేడు కూడా ఒక ప్రమాదం జరిగింది అనకాపల్లిలో. దీనితో ఏపీ సర్కార్ ఇప్పుడు చర్యలకు రంగం సిద్దం చేస్తుంది. ఏ మాత్రం భద్రతా ప్రమాణాలను పాటించని కంపెనీల మీద సీరియస్ గా అడుగులు వేయనుంది. ఇదిలా ఉంచితే ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రమాదాలను కట్టడి చేసే విధంగా ఈ నిర్ణయం ఉండనుంది.
పరిశ్రమల భద్రత కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల్లో అంతర్గిక ఆడిట్ పక్కగా నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. సేఫ్టీ ఆడిట్ జరిగిన సంస్థల్లో ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయని విచారణ నిర్వహించాలని ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. 1997 నుంచి నేటి వరకు 110 మంది మరణించినట్లు అధికారుల అంచనా వేశారు. రాష్ట్రంలో రెడ్ క్యాటగిరి పరిశ్రమలు 300 ఉన్నాయి. దాదాపుగా 228 పరిశ్రమలు విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. పరిశ్రమల్లో భద్రతాపరమైన చర్యలు పర్యవేక్షించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
జిల్లా స్థాయిలో ఉన్న సేఫ్టీ కమిటీ సమావేశాలు తక్షణమే సమావేశం అవ్వాలని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ప్రతి పరిశ్రమలో ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. మంగళ, బుధవారాల్లో విశాఖపట్నంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన పలు కంపెనీలను పరిశీలించే అవకాశం ఉంది. ఏది ఏమైనా పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకునే విధంగా బాబు సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటించని సంస్థల పై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.