సాధారణంగా మద్యం వ్యాపారంలో ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తే టెండర్ ల కోసం ఎగబడుతూ ఉంటారు వ్యాపారులు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో బార్ పాలసీకి ఏ మాత్రం స్పందన రావడం లేదు. మొత్తం 840 బార్లకు 90 అప్లికేషన్ లు మాత్రమే రావడం చూసి ఎక్సైజ్ శాఖ షాక్ అవుతోంది. ప్రముఖ జిల్లాల్లో 15 దాటి ఒక్క అప్లికేషన్ కూడా పడలేదు. ప్రకాశం జిల్లాలో కేవలం 5 అప్లికేషన్ లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైన్ షాపుల కోసం ఎగబడిన మద్యం వ్యాపారులు, బార్ ల విషయంలో మాత్రం ముందుకు అడుగు వేయడం లేదు.
Also Read : అప్పుడు ప్రజాస్వామ్యం లేదా చిన్న సారూ..?
ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన ఈ నూతన బార్ పాలసీ సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి రావాల్సి ఉంది. 840 బార్లకు ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. మొదటి రోజుల్లో కేవలం 19 మాత్రమే అప్లికేషన్ లు దాఖలు కావడం చూసి షాక్ అయింది ఎక్సైజ్ శాఖ. వివిధ జిల్లాల్లో సుమారు 250 మంది ప్రాసెసింగ్ ఫీజు రూ.10వేలు చెల్లించి రిజిస్ర్టేషన్ చేసుకుని, 90 మంది మాత్రమే రూ.5 లక్షలు చెల్లించి అప్లికేషన్ దాఖలు చేసారు. భారీగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది.
దరఖాస్తులు పెద్ద ఎత్తున రాకపోవడంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నిబంధనల ప్రకారం ప్రతి బార్కు 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాల్సి ఉంటుంది. ఫీజు మాత్రం వెనక్కు ఇచ్చే అవకాశం లేదు. దీనిపై వ్యాపారులు విమర్శలు చేయడంతో.. ఆ నిబంధనలో మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. లాటరీ తీయకపోతే దరఖాస్తుదారులకు ఫీజు వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించింది. అయినా సరే స్పందన రావడం లేదు.
Also Read : జగన్ మరో ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?
అయితే అప్లికేషన్ లు రాకపోవడానికి ప్రధాన కారణం.. తక్కువ ధరకే మద్యం దొరకడం, అన్ని బ్రాండ్ లు అందుబాటులో ఉండటమే అని తెలుస్తోంది. వైసీపీ హయాంలో మద్యం షాపుల్లో నాణ్యమైన మద్యం దొరకకపోవడంతో బార్ లకు డిమాండ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారడంతో ఆసక్తి చూపించడం లేదు. దానికి తోడు వైన్ షాపులకు పర్మిట్ రూమ్ లను కూడా కేటాయించింది ప్రభుత్వం. దీనితోనే ఈ విషయంలో వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు అంటున్నారు నిపుణులు.




