సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా… మరో చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే ప్రమాదానికి కారణమంటూ సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. బన్నీ అరెస్టును బీఆర్ఎస్, వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. బన్నీ అరెస్టు వెనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు కూడా. అయితే ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వైసీపీ నేతలు కాస్త వెనక్కి తగ్గారు.
Also Read: అల్లు ఫ్యామిలీపై టాలీవుడ్ పెద్దల ఒత్తిడి..? అల్లు Vs దిల్ రాజు..!
అయితే బన్నీ అరెస్టు అంశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే ప్రస్తావించారు. పుష్ప 2 సక్సెస్ మీట్లో సీఎం పేరు మర్చిపోయినందుకే బన్నీని రేవంత్ రెడ్డి అరెస్టు చేయించారని కేటీఆర్ నేరుగా విమర్శించారు. ఇదే విషయాన్ని పలుమార్లు గుర్తు చేశారు. బన్నీ అరెస్టు తర్వాత ప్రత్యేకంగా ప్రెస్మీట్ పెట్టి మరీ అదే విషయాన్ని గుర్తు చేశారు. ఇలాగే పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కూడా తెలంగాణ సీఎం పేరును మర్చిపోయారని… అందుకే జైలులో పెట్టారంటూ సెటైర్లు కూడా వేశారు. టీవీ ఇంటర్వ్యూల్లో కూడా పదేపదే ఇదే విషయాన్ని ప్రస్తావించారు కేటీఆర్.

ఇక అసెంబ్లీలో రేవంత్ ప్రసంగం తర్వాత అదే రోజు సాయంత్రం బన్నీ ప్రెస్మీట్ పెట్టాడు. ఆ తర్వాత ఈ వ్యవహారం మరింత ముదిరింది. అల్లు అర్జున్ ఇంటిపైన ఓయూ జేఏసీ పేరుతో కొందరు దాడి చేశారు. అలాగే సస్పెండ్ అయిన పోలీస్ అధికారి ఒకరు ప్రెస్మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్కు, టాలీవుడ్కు, బన్నీ ఫ్యాన్స్కు మధ్య చిచ్చుపెట్టే కుట్ర జరుగుతోందని తేలిపోయింది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్, బన్నీ ఆర్మీ టీమ్… మొత్తం ఎపిసోడ్కు కారణమేంటనే కోణంలో విశ్లేషించారు. ఇంటిపై దాడి చేసిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్తగా గుర్తించారు.
Also Read: రాజీకి సిద్దం.. రేవంత్ ఇంటికి సినిమా పెద్దలు…!
అలాగే సస్పెండ్ అయిన పోలీస్ అధికారి కూడా గతంలో కేసీఆర్, కేటీఆర్పై తనకున్న అభిమానం వ్యక్తం చేశారని.. అదే సమయంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా… కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించినట్లు హస్తం పార్టీ నేతలు గుర్తించారు. దీంతో రేవంత్కు బన్నీకి మధ్య విబేధాలు రేపేందుకు తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ కుట్రలు చేస్తున్నాడనేది కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణ. ఇటు బన్నీ ఆర్మీ కూడా ఇదే నిజమని భావిస్తోంది. కేటీఆర్ కుట్రల వల్లే బన్నీకి ఇబ్బందులు వచ్చాయని.. లేదంటే పుష్ప 2 సినిమాకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించింది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు.