ఆంధ్రప్రదేశ్ లో కొందరు నేతలు ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్న సంగతి తెలిసిందే. తమను ప్రభుత్వం ఇబ్బంది పెట్టె అవకాశం ఉందని భావించిన చాలా మంది నేతలు కూటమిలోని జనసేన, బిజెపి పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే కొన్ని కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కొందరు నేతలు కూడా టీడీపీలోకి రావడానికి మార్గం సుగుమం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలు ఇప్పుడు టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారు.
కాదు కూడదు అంటే జనసేనలోకి అయినా వెళ్లాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అందులో మొదటి నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి అని వార్తలు వస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి వెళ్ళే ఈ నేత ఇప్పుడు టీడీపీ లేదా జనసేనలో జాయిన్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన ట్రాక్ రికార్డ్ తెలిసిన కొందరు టీడీపీ నేతలు ఆయన్ను రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో నేత కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి కూడా సిద్దం అవుతున్నారని తెలుస్తోంది.
Read Also : చంద్రబాబు కి తలనొప్పిగా తయారైన అధికారులు.. వీరిపై చర్యలుండవా?
ఈయన ఎన్నికల సమయంలోనే రావాల్సి ఉన్నా కొన్ని కారణాలతో ఆగిపోయింది. అలాగే ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఒక కీలక నేత కూడా పార్టీ మారేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనపై పార్టీ సానుకూలంగానే ఉంది. ఇప్పటికే కాకర్ల సురేష్ తో కూడా ఆయన చర్చలు జరిపారట. నెల్లూరు నగరానికి చెందిన కొందరు కీలక నేతలు మంత్రి నారాయణ వద్దకు రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నారాయణ మాత్రం వారిని నమ్మడం లేదట. అనీల్ కుమార్ అనుచర వర్గం మొత్తాన్ని లాగే ప్రయత్నం చేస్తున్న నారాయణ… త్వరలోనే కొందరిని జనసేనలోకి పంపే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు.