ఉండవల్లి అరుణ్ కుమార్.. రెండుసార్లు ఎంపీగా పని చేసిన అనుభవం. న్యాయవాది. ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఆయనపై రాలేదు. అన్నిటికి మించి.. మార్గదర్శి సంస్థపై కేసు వేసి అందరి దృష్టి ఆకర్షించారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును టార్గెట్ చేశారు. ఇప్పటికీ మార్గదర్శి కేసు విచారణ కోర్టులో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులు. అందుకే వరుసగా రెండోసారి కూడా రాజమండ్రి ఎంపీ టికెట్ ఉండవల్లికి దక్కింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లి రాజకీయాలకు దూరమయ్యారు. వాస్తవానికి వైఎస్ మృతి తర్వాత ఉండవల్లి కూడా జగన్ వెంట నడుస్తారని అంతా ఊహించారు. వైసీపీలో చేరుతారని కూడా భావించారు. కానీ ఉండవల్లి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.
Also Read : పొట్టి ఫార్మాట్ కెప్టెన్ గా గిల్..? షాక్ ఇచ్చిన బోర్డు..!
పదేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటున్న ఉండవల్లి అరుణ్ కుమార్కు ఇప్పటికీ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రెస్ మీట్ పెడితే.. చాలా మంది ఫాలో అవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై ఉండవల్లి తనదైన శైలిలో విశ్లేషణ ఇస్తారు. అందుకే ఉండవల్లి చేసే వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో పెద్ద దుమారం కూడా రేపుతాయి. కొన్ని సార్లు రాజకీయ పార్టీల భవిష్యత్తు, వాటి మనుగణపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు నిజాలు కూడా అయ్యాయి. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని.. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఉండవల్లి ముందే చెప్పారు.
తాజాగా వైసీపీ భవిష్యత్తుపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు నిజమే అనేలా ఉన్నాయి. వైసీపీ లేదు.. బొక్క లేదు.. అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పని అవుట్ అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించడంతో సంచలనం గా మారింది. ప్రస్తుతం చంద్రబాబుకు సరైన అవకాశం దక్కిందన్నారు ఉండవల్లి. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారని.. చంద్రబాబు ఏం కావాలంటే అది చేసేందుకు కేంద్రంగా సిద్ధంగా ఉందన్నారు. జగన్పైన కొత్తగా కేసులు పెట్టాల్సిన అవసరం లేదని.. గతంలో ఆయనపై ఉన్న కేసుల్లో విచారణ పూర్తి చేసి శిక్ష వేస్తే చాలన్నారు. గతంలో మంజూరు చేసిన బెయిల్ మంజూరు చేస్తే.. జగన్ మళ్లీ జైలుకు పోతారని.. అప్పుడు ఆ పార్టీని నడిపించే లీడర్ లేరన్నారు ఉండవల్లి. గతంలో జగన్కు తల్లి, చెల్లి, కుటుంబం అండగా ఉందని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వైసీపీలో సరైన లీడర్ కనిపించటం లేదన్నారు. జగన్కు శిక్ష పడితే.. తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కూడా ఉండదని.. అప్పుడు వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్నారు.
Also Read : మరోసారి తప్పుడు ప్రచారం.. ఈసారి..!
ప్రస్తుతం ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఉండవల్లి వ్యాఖ్యలపై వైసీపీ నేతలే కలవరపడుతున్నారు. నిజంగానే జగన్ జైలుకు పోతారా.. శిక్ష పడుతుందా.. అని చర్చించుకుంటున్నారు. మధుకోడా వంటి నేతలకే శిక్ష పడిన సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు కూడా జగన్కు వ్యతిరేకంగా ఉన్నాయని అంచనా వేసుకుంటున్న వైసీపీ నేతలు.. పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.