ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి సహా 13 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. కింగ్ పిన్ కోసం వేట కొనసాగుతోంది. రిటైర్ట్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ కూడా తాను సాక్షిగా మారేందుకు అనుమతించాలని సిట్ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. దీంతో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టు ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. మీడియాతో చిట్ చాట్లో జగన్ అరెస్టు ఖాయమనే మాట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే జగన్ను అరెస్టు చేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారు.. ప్రజల్లో వైసీపీకి సానుభూతి వస్తుందా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు వస్తాయనే కోణంలో కూడా ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : నన్ను కెలకొద్దు కెటిఆర్.. సంచలన విషయాలు బయటపెట్టిన సిఎం రమేష్
లిక్కర్ స్కామ్ కేసులో జగన్ అరెస్టుపై కూటమి ప్రభుత్వం కేంద్ర పెద్దలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీ పైకి మాత్రమే బీజేపీ పై విమర్శలు చేస్తోంది. కానీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతు తెలిపింది. 25కు 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అంటూ గొప్పగా చెప్పిన జగన్.. ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలిచిన తర్వాత.. ప్రస్తుతం మోదీ సర్కార్ భయపడేలా లేదు అని మాట మార్చేశారు. కేంద్రం కంట్రోల్లో ఉంటేనే రాష్ట్రానికి నిధులు వస్తాయన్నారు కూడా. ఐదేళ్ల పాటు కేంద్రం కంట్రోల్లోనే జగన్ ఉన్నారనే మాట బాగా వినిపించింది. అందుకే లోక్సభలో, రాజ్యసభలో కూడా డిప్యూటీ స్పీకర్ పదవులను వైసీపీకి కూడా కేటాయించింది మోదీ సర్కార్. లోక్సభలో మిథున్ రెడ్డి, రాజ్యసభలో విజయసాయిరెడ్డి సభను నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూడా బీజేపీపైన, మోదీ పైన జగన్ ఎలాంటి విమర్శలు చేయలేదు.
ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ వైఖరీలో ఎలాంటి మార్పు లేదు. టార్గెట్ చంద్రబాబు అన్నట్లుగానే విమర్శలు చేస్తున్నారు తప్ప.. బీజేపీపైన, ఆ పార్టీ పెద్దలపైన పల్లెత్తు మాట కూడా అనలేదు. వైసీపీ నేతలు కూడా కేంద్రం జోలికి అస్సలు వెళ్లడం లేదు. ఏం జరిగినా సరే.. అది చంద్రబాబు, లోకేష్ వల్లే అని.. దానికి బాధ్యులు వాళ్లిద్దరే అంటున్నారు తప్ప.. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన, బీజేపీలది ఎలాంటి తప్పు లేదంటున్నారు. ఇప్పుడు లిక్కర్ కేసులో కూడా చంద్రబాబును అరెస్టు చేసినందుకే.. జగన్ను కూడా జైలుకు పంపేందుకు ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నాకేం కాదులే అని ధైర్యంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత.. తాన అరెస్టు ఖాయమనే భయం జగన్లో ఉందని… అందుకే తాడేపల్లికి కూడా రాకుండా.. బెంగళూరు ఎలహంక ప్యాలస్లోనే న్యాయ నిపుణులు, సన్నిహితులతో ఇదే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : గజపతి రాజు సిగరెట్ కష్టాలు.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
ఇక మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత జగన్ ఢిల్లీ వెళ్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కేంద్రంలోని పెద్దలతో జగన్ భేటీ అవుతారనే మాట కూడా వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసు విచారణ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించడానికి బీజేపీ పెద్దలతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఇండియా కూటమి ముఖ్య నాయకులతో కూడా జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. తనకు మద్దతుగా నిలవాలని ఢిల్లీ పెద్దలను కోరేందుకే జగన్ హస్తిన వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయ్యారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూడా తనను అరెస్టు చేస్తే… బీజేపీపై విమర్శలు వస్తాయనేది జగన్ మాట. తనను అరెస్టు చేస్తే.. అది పెద్ద దుమారం రేపుతుందని.. గతంలో అక్రమాస్తుల కేసులో అరెస్టనప్పుడు తాను కేవలం ఒక పార్టీకి అధ్యక్షుడిని మాత్రమే అని… కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అని జగన్ ఢిల్లీ పెద్దలను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. తనను తప్పుడు కేసులో అరెస్టు చేయాలని చూస్తున్నారని.. నేషనల్ మీడియా ముందు వాపోవడంతో పాటు.. చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది.